
ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ఫోన్లు, సోషల్ మీడియా అడిక్షన్తో పిల్లల భవిష్యత్తు నాశనమవుతోందని ఆందోళన చెందుతున్న కోట్లాది మంది తల్లిదండ్రులకు మద్దతుగా యునైటెడ్ కింగ్డమ్ (UK) ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా ఉపయోగించకుండా పూర్తిస్థాయిలో నిషేధం విధిస్తున్నట్లు బ్రిటన్ ప్రధానమంత్రి కియిర్ స్టార్మర్ సోమవారం అధికారికంగా ప్రకటించారు. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా విడుదల చేసిన ఒక ప్రత్యేక వీడియో సందేశంలో ఆయన ఈ సంచలన నిర్ణయాన్ని ప్రపంచ దేశాల ముందుకు తెచ్చారు. ఈ నిర్ణయం ఏదో రాత్రికి రాత్రి తీసుకున్నది కాదని, దేశవ్యాప్తంగా వేలాది మంది తల్లిదండ్రులతో విస్తృతంగా చర్చించిన తర్వాతే ఈ ముందడుగు వేశామని ప్రధాని స్టార్మర్ స్పష్టం చేశారు. ఈ రోజుల్లో సాంకేతికత పిల్లల జీవితాల్లోని ప్రతి భాగంలోనూ దూరిపోతోంది. ఇది వారిని ఎంతగానో దెబ్బతీస్తోంది. వేలాది మంది తల్లిదండ్రులు తమ పిల్లలు సోషల్ మీడియాకు బానిసలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరంతరం స్క్రీన్ స్క్రోలింగ్ చేస్తూ కాలక్షేపం చేయడం వల్ల పిల్లలు ఆడుకోవడానికి, ప్రశాంతంగా నిద్రపోవడానికి, కనీసం కుటుంబంతో గడపడానికి కూడా సమయం లేకుండా పోతోంది. ఇది వారి మానసిక ఆరోగ్యాన్ని ఘోరంగా దెబ్బతీస్తోంది. ఈ విషయంలో తల్లిదండ్రులకు ప్రభుత్వం తరఫున అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్ను పూర్తిగా బ్యాన్ చేస్తున్నాం అని ప్రధాని పేర్కొన్నారు.సోషల్ మీడియా బ్యాన్! పార్లమెంట్లో డిజిటల్ సేఫ్టీ యాక్ట్ బిల్లుప్రపంచ దిగ్గజ కంపెనీలతో యుద్ధానికైనా రెడీ!ఈ నిషేధం అమలు చేయడం అంత తేలిక కాదని, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సోషల్ మీడియా దిగ్గజ కంపెనీల నుంచి ఈ నిర్ణయానికి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుందని బ్రిటన్ ప్రధాని అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయాన్ని అడ్డుకోవడానికి కొన్ని పెద్ద పెద్ద కంపెనీలు ప్రయత్నిస్తాయి. కానీ మేము వారితో తలపడటానికి సిద్ధంగా ఉన్నాం. ఈ పోరాటంలో మేమే గెలుస్తాం.