
ఇంటర్నెట్ డెస్క్: శివసేన (UBT) ఎంపీలు శిందే వర్గంలో చేరనున్నట్లు వస్తున్న వార్తలపై పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) స్పందించారు. పార్టీని వీడాలనుకునే వారు వెళ్లిపోవచ్చని.. ఈ విషయంలో వారికి పూర్తి స్వేచ్ఛ ఉందని అన్నారు. 2022లో శివసేన చీలికకు దారితీసిన తిరుగుబాటును ప్రస్తావిస్తూ.. నాలుగేళ్ల క్రితం పార్టీలో పెద్ద చీలిక ఏర్పడిందని.. అప్పట్లో నలభై మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోయారని అన్నారు. అయితే ఎవరినీ పార్టీలో ఉండమని బలవంతం చేయకూడదని నిర్ణయించుకున్నానని వెల్లడించారు. పార్టీని వీడిన వారు ఎన్నటికైనా పశ్చాత్తాపపడతారని ఉద్ధవ్ పేర్కొన్నారు. కానీ అప్పటికే సమయం మించిపోతుందన్నారు. ఈ రోజు సమయం తనది కాకపోయినా రేపు కచ్చితంగా తనదే అవుతుందని.. అప్పటి వరకు ఓర్పుతో ముందుకు సాగుతానని అన్నారు. ‘ఆపరేషన్ టైగర్’ పేరుతో ఠాక్రే వర్గంలోని ఎంపీలను తమ వైపు తిప్పుకోవడానికి శిందే వర్గం కుట్ర పన్నుతోందని వార్తలు వస్తున్నాయి. కాగా ఉద్ధవ్ సేన ఎంపీలు పార్టీని వీడనున్నారనే వార్తలను ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ కొట్టిపడేశారు. ఇదీ చదవండి: ‘ఆయనో పెద్ద జోక్’.. కాంగ్రెస్- డీఎంకేల మధ్య ముదిరిన వైరం గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు