
ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్లో మీడియాకు స్వేచ్ఛ (Press Freedom) లేదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (JD Vance) అన్నారు. అందువల్లే ఇరాన్తో కుదుర్చుకున్న ఒప్పందానికి (MoU) సంబంధించిన పూర్తి వివరాలను విడుదల చేయడంలో జాప్యం జరిగిందని తెలిపారు. అమెరికా-ఇరాన్ డీల్కు ఖతార్తో కలిసి పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. జూన్ 15న మధ్యంతర శాంతి ఒప్పందాన్ని ట్రంప్ ప్రకటించగా.. రెండు రోజుల తర్వాత ఈ ఒప్పందం (MoU) అధికారిక పత్రం విడుదలైంది. పాకిస్థాన్ (Pakistan), ఖతార్లో పత్రికా స్వేచ్ఛ సరిగ్గా లేకపోవడం, పారదర్శకతపై ఉన్న ఆందోళనల కారణంగానే వివరాలను విడుదల చేయడానికి వాషింగ్టన్ సమయం తీసుకుందని వాన్స్ పేర్కొన్నారు. దేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛ, మత స్వేచ్ఛకు భంగం కలిగించే చట్టాలను ప్రభుత్వం అమలు చేయడాన్ని అమెరికా రాజ్యాంగం నిషేధిస్తుందని జేడీ వాన్స్ పేర్కొన్నారు. పాక్లో అటువంటి రాజ్యాంగపరమైన రక్షణలు లేకపోవడంతోనే ఈ ఆలస్యం జరిగిందన్నారు. ఇరాన్తో చేసుకున్న ఒప్పందంలో ఆ దేశానికి గణనీయమైన రాయితీలు ఇచ్చే అవకాశం ఉన్నందున.. అమెరికా అవగాహన ఒప్పందం (MoU) వివరాలను గోప్యంగా ఉంచుతోందని వస్తున్న విమర్శలను ఆయన ఖండించారు. ఇదీ చదవండి: ఫన్నీగా అంటే.. ప్రపంచమంతా పాకింది: ‘బాస్’ వ్యాఖ్యలపై ట్రంప్ గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు