
‘తిరైకథై మన్నన్‘... అంటే ‘స్కీన్ర్ప్లే చక్రవర్తి’గా ఖ్యాతి పొందిన ఆ మహా దర్శకుడి గుండె జూన్ 27, 2026న చెన్నైలో ఉదయం ఆరు గంటలకు ఆగిపోయింది. ఆ గుండె 49 ఏళ్లుగా తమిళ సినిమా గుండెచప్పుడైంది. కె.భాగ్యరాజా... మన భాగ్యరాజా గురువు భారతీరాజా వెళ్లిపోయిన 17 రోజులకే ప్రయాణం కట్టాడు. ఇది యాదృచ్ఛికం కాదు. విధి రాసిన స్కీన్ర్ప్లే. భాగ్యరాజా కథలో అయితే ఇదే అత్యంత బలమైన, అత్యంత బాధాకరమైన క్లైమాక్స్. భారతీయ సినీ ప్రేక్షకులకు సిసలైన దేశీయ వినోదభాగ్యం అందించిన కె. భాగ్యరాజా ఒక మనిషి కాదు... యూనివర్సిటీ. దర్శకుడు, రచయిత, నటుడు, సంగీత దర్శకుడు, నిర్మాత, ఎడిటర్, పత్రికా సంపాదకుడు. అన్నిటి కంటే ముందు అతనొక కథకుడు. కాగితం అందుకుని రెండు లైన్లు రాస్తే చాలు థియేటర్ దద్దరిల్లాల్సిందే. కథ అల్లితే బుకింగ్స్ కిటకిటలాడాల్సిందే. అందుకే సౌత్ సినిమా కె. భాగ్యరాజాను ‘కింగ్ ఆఫ్ స్క్రీన్ ప్లే’ అని, ‘తిరైకథై మన్నన్’ అని శిరస్సు వంచి అంగీకరించింది. ఆ ఒక్క షాట్: శిష్యుడి జననం 1977... ‘16 వయదినిలే’ షూటింగ్. భారతీరాజా డైరెక్టర్. భాగ్యరాజా అసిస్టెంట్. పల్లెటూరికి వచ్చిన డాక్టర్ కుట్రతో శ్రీదేవిని లోబరుచుకునే కీలక సీన్ తీస్తున్నాడు భారతీరాజా. భాగ్యరాజా గురువు దగ్గరకు వెళ్లి గుసగుసగా అన్నాడు... ‘సార్, ఇక్కడ ఒక కొబ్బరికాయ విజువల్ పెడితే?’.... లోపల అమాయకురాలి జీవితం నాశనమవుతోందనడానికి సింబాలిక్గా బయట పచ్చటి కొబ్బరికాయను చెక్కుతున్న విజువల్. భారతీరాజా విన్నాడు. తీశాడు. రిజల్ట్? తమిళ సినిమా చరిత్రలో ఆ సింబాలిక్ షాట్ని నేటికీ చెప్పుకుంటారు. శిష్యుడి కలంలో ఉన్న మాంత్రిక శక్తిని ఆ రోజే గుర్తించిన గురువు ‘నా తర్వాత వెలుగులోకి వచ్చేది వీడే’ అని అక్కడికక్కడే ప్రకటించాడు. అలా మొదలైంది ‘తిరైకథై మన్నన్ ’ ప్రస్థానం. గోబిచెట్టిపాళయం నుంచి మద్రాస్ దాకా 7 జనవరి 1953... కోయంబత్తూరుకు గంటన్నర దూరంలో ఉన్న గోబిచెట్టిపాళయం దగ్గర వెళ్లాంకోవిల్