
Telangana news:అంగన్వాడీ కేంద్రాలే చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు- మంత్రి సీతక్క, హైదరాబాద్ జిల్లా గోల్కొండ ప్రాజెక్టు పరిధిలోని మల్లేపల్లి సెంటర్, మహాత్మా గాంధీ నగర్ అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన “అమ్మ మాట – అంగన్వాడీ బాట” కార్యక్రమంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క పాల్గొన్నారు. నాంపల్లి ఎమ్మెల్యే మజీద్ హుస్సేన్ తో కలిసి చిన్నారుల నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి, ప్రీ-స్కూల్ విద్యార్థులకు యూనిఫాంలు పంపిణీ చేసి, ప్రాథమిక పాఠశాలల్లో చేరనున్న చిన్నారులకు విద్యారంభ ధృవపత్రాలను అందజేశారు. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులతో కలిసి అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సీతక్క, వారిని ఆప్యాయంగా పలకరిస్తూ అభ్యాసన పుస్తకాలు, ఆటవస్తువులను అందించారు. కేంద్రంలో అందుతున్న ప్రీ-స్కూల్ విద్య, పోషకాహార సేవలు, బోధన సామగ్రి వినియోగాన్ని పరిశీలించి చిన్నారుల అభ్యాస పురోగతిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, బాల్యంలోనే విద్యకు బలమైన పునాది వేయడంలో అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. పోషకాహారం, ప్రీ-స్కూల్ విద్య, ఆరోగ్య సేవలను సమగ్రంగా అందిస్తూ చిన్నారుల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు. ప్రతి చిన్నారి అంగన్వాడీలో చేరేలా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. Read also: Hyderabad Traffic Police: విద్యార్థులకు చాక్లెట్లతో వెల్కమ్.. విద్యానగర్ స్కూల్లో రహదారి భద్రతపై బేగంపేట TTI అవగాహన సదస్సు! అంగన్వాడీ సేవలను ప్రతి కుటుంబానికి చేరవేయడమే “అమ్మ మాట – అంగన్వాడీ బాట” కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని మంత్రి తెలిపారు. చిన్నారుల భవిష్యత్తును తీర్చిదిద్దే కేంద్రాలుగా అంగన్వాడీలను మరింత బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు. అంగన్వాడీల ద్వారా లభించే సేవలపై తల్లిదండ్రులు పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకొని తమ పిల్లలను కేంద్రాల్లో నమోదు చేయించాలని సూచించారు. రాష్ట్రంలో అంగన్వాడీలను కేవలం పోషకాహార కేంద్రాలుగానే కాకుండా చిన్నారుల భవిష్యత్తును తీర్చిదిద్దే తొలి విద్యాలయాలుగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు