
Viral Video: భారతీయ రైల్వేలలో ప్రయాణం అంటే ప్రతి భారతీయుడి జీవితంలో ఓ విడదీయరాని భాగం. అయితే సౌకర్యవంతమైన ప్రయాణాన్ని ఆశించే ప్రయాణీకులు తమ వంతు కనీస బాధ్యతలను ఎంతవరకు గుర్తుంచుకుంటున్నారనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన రెండు వీడియోలు చూస్తే రైలు క్యాబిన్లను కొందరు ప్రయాణికులు ఏ విధంగా వాడుకుంటున్నారో స్పష్టమవుతోంది. ఒక ప్రయాణికురాలు రైలులోనే వేరుశనగ తొక్కలు పడేస్తుంటే, మరో వ్యక్తి గుడ్లు ఒలుస్తూ లోపలి ప్రాంతాన్ని అపరిశుభ్రం చేయడం నెటిజన్లను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తోంది. ఈ వీడియోలు చూసిన నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. రైల్వే శాఖను, ప్రయాణ సౌకర్యాలను ప్రతిదానికీ తప్పుబట్టే ప్రజలు, తమ సొంత ప్రవర్తనను ఎందుకు మార్చుకోవడం లేదనే చర్చ నడుస్తోంది. రైలు ప్రయాణంలో కేవలం టికెట్ కొనుగోలు చేయడం మాత్రమే సరిపోదని.. తోటి ప్రయాణీకులను ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు సామాజిక స్పృహ కూడా అంతే ముఖ్యమని ఈ ఘటనలు గుర్తుచేస్తున్నాయి. ప్రయాణాల్లో పరిశుభ్రతను పాటించకపోవడం వల్ల దేశ ప్రతిష్ట కూడా దెబ్బతింటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వైరల్ వీడియోల్లో సామాజిక స్పృహ లేని ప్రవర్తన సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయిన ఒక వీడియోలో.. సీట్లో కూర్చున్న ఒక మహిళ పక్కనే చెత్తడబ్బా ఉన్నప్పటికీ, రైలు గదిలోనే తింటూ వేరుశనగ తొక్కలను కింద పడేస్తోంది. దీనిని గమనించిన తోటి ప్రయాణికుడు ఆవేదన వ్యక్తంచేశాడు. ఆమె గత 5 గంటలుగా నిరంతరం ఏదో ఒకటి తింటూ రైలును చెత్తాచెదారంతో నింపేస్తోందని పేర్కొన్నాడు. అయితే సురక్షితంగా ప్రయాణించాలనే ఉద్దేశంతో ఆమెతో గొడవ పెట్టుకోలేకపోయానని సదరు ప్రయాణికుడు వాపోయాడు. మరోవైపు ఎక్స్ (గతంలో ట్విట్టర్) లో షేర్ చేసిన ఇంకొక వీడియో మరింత ఘోరంగా ఉంది. అందులో ఓ ప్రయాణికుడు రైలు సీటులోనే సాఫీగా కూర్చుని గుడ్లు వలవడం, ఉల్లిపాయలు కోయడం వంటివి చేస్తూ, ఆ వ్యర్థాలను అక్కడే వదిలేశాడు. ఈ ప్రవర్తనపై