
AP SSC Advanced Supplementary Results : ఏపీలో టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఫలితాలను శుక్రవారం ఉదయం ట్విటర్ వేదికగా విడుదల చేశారు. 94,990 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా వీరిలో 78,261 మంది (82.39శాతం) ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాదితో (76.14%) పోలిస్తే ఇది 6.25 శాతం మెరుగుపడిందని లోకేశ్ పేర్కొన్నారు. ఫలితాలను results.bse.ap.gov.in ద్వారా లేదంటే వాట్సాప్ నెంబర్ 955230009 ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చునని తెలిపారు. ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షల తర్వాత విద్యార్థులకు ప్రత్యేక విద్యా మద్దతు, ఇంటెన్సివ్ కోచింగ్, వ్యక్తిగత మార్గదర్శకత్వాన్ని ప్రభుత్వం అందించిందన్న లోకేశ్.. 20 రోజుల కార్యాచరణ ప్రణాళిక విజయవంతమైందనడానికి ఈ ప్రోత్సాహకరమైన ఫలితాలే నిదర్శనమన్నారు. విజయానికి కారణమైన విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు పాఠశాల సిబ్బందికి లోకేశ్ అభినందనలు తెలిపారు. విద్యార్థులందరూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు