
కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ స్కూటర్లను వాటి వేగం, మోటార్ సామర్థ్యం ఆధారంగా వర్గీకరించింది. కొన్ని స్కూటర్లు "లో-స్పీడ్ ఎలక్ట్రిక్ వాహనాలు" కేటగిరీలోకి వస్తాయి. సాధారణంగా గంటకు 25 కిలోమీటర్ల కంటే తక్కువ వేగంతో ప్రయాణించే ఎలక్ట్రిక్ స్కూటర్లకు డ్రైవింగ్ లైసెన్స్, ఆర్టీఓ రిజిస్ట్రేషన్ అవసరం ఉండదు. ఇలాంటి వాహనాలను తక్కువ ప్రమాదకర వాహనాలుగా ప్రభుత్వం పరిగణిస్తుంది. అందుకే వాటికి ప్రత్యేక మినహాయింపులు కల్పించింది దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. కాలుష్యాన్ని తగ్గించడం, ఇంధన వినియోగాన్ని నియంత్రించడం కోసం ఈవీలను ప్రోత్సహిస్తోంది. లో-స్పీడ్ స్కూటర్లు సాధారణంగా కాలనీలు, పట్టణ ప్రాంతాలు, చిన్న దూరాల ప్రయాణాలకు ఉపయోగపడతాయి. వీటి వేగం తక్కువగా ఉండటంతో ప్రమాదాల అవకాశం కూడా తక్కువగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ప్రజలు సులభంగా ఈ వాహనాలను ఉపయోగించేందుకు లైసెన్స్ నిబంధనలను సడలించింది. డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదని చెప్పడం వల్ల ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదని కాదు. ఎలక్ట్రిక్ స్కూటర్ అయినా, ఇతర వాహనం అయినా రోడ్డు భద్రతా నియమాలు అందరికీ ఒకేలా వర్తిస్తాయి. ప్రయాణ సమయంలో హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించడం, అతివేగంగా నడపకపోవడం, రోడ్డు భద్రతా నిబంధనలను పాటించడం వంటివి కచ్చితంగా పాటించాల్సిందే. అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఈ మినహాయింపు వర్తించదు. గంటకు 25 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో వెళ్లే హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు సాధారణ మోటార్ వాహనాల కిందకు వస్తాయి. అలాంటి స్కూటర్లకు డ్రైవింగ్ లైసెన్స్, ఆర్టీఓ రిజిస్ట్రేషన్, వాహన బీమా, నంబర్ ప్లేట్ తప్పనిసరిగా ఉండాలి. లేకపోతే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ సడలింపు వల్ల విద్యార్థులు, ఉద్యోగులు, చిన్న పట్టణాల్లో నివసించే ప్రజలు ఎక్కువగా లాభపడుతున్నారు. లైసెన్స్ పొందడానికి సమయం, ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా తక్కువ ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసి ఉపయోగించగలుగుతున్నారు. అదే సమయంలో పర్యావరణహిత రవాణాను