
బ్రిక్స్ ఎన్ఎస్ఏల భేటీలో అజిత్ ధోవల్ న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో శాంతి కోసం అమెరికా–ఇరాన్ మధ్య కుదిరిన డీల్ను భారత్ స్వాగతిస్తోందని జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ) అజిత్ ధోవల్ అన్నారు. హార్మూజ్ను తిరిగి తెరవడం ద్వారా ప్రపంచ ఇంధన భద్రతతోపాటు ఇతర కీలక వస్తువులు, ఎరువుల సరఫరాలో సుస్థిరత నెలకొంటుందని చెప్పారు. బ్రిక్స్ దేశాల ఎన్ఎస్ఏల రెండు రోజుల సదస్సును మంగళవారం ఆయన ప్రారంభించి, ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ, రష్యా ఎన్ఎస్ఏ సెర్గీ షోయిగూ, ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ సెక్రటరీ ఘదిర్ నెజామిపౌర్, బ్రిక్స్ దేశాల ఇతర భద్రతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అజిత్ దోవల్.. భౌగోళిక రాజకీయ అనిశ్చితి, ఆర్థిక ఒత్తిళ్ల వంటి సవాళ్లను పరిష్కరించడంలో కూటమి కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు. అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన అవగాహనా ఒప్పందాన్ని భారత్ స్వాగతిస్తోందన్నారు. ఒప్పందం విజయవంతం అవుతుందని, ఇంధన భద్రతకు దోహదపడుతుందని ఆశిస్తున్నామన్నారు. హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం స్వాగతించదగిన పరిణామమన్నారు. ఇది సప్లయ్ చైన్లో అడ్డంకులను తొలగించడమే కాకుండా ఎరువులు, రసాయనాలు తదితరాల కొరతను కూడా తీరుస్తుందని ధోవల్ తెలిపారు. అంతర్జాతీయంగా ప్రస్తుతం వివిధ రకాలైన సమస్యలను అనేక దేశాలు నేడు ఎదుర్కొంటున్నాయి. అయితే, ఈ వివాదాలను పరిష్కరించడానికి లేదా తగ్గించడానికి అవసరమైన వ్యవస్థాగతమైన యంత్రాంగాలు కూడా అంతగా అందుబాటులో ఉండటం లేదని చెప్పారు. అత్యంత ప్రత్యేక కూటమి బ్రిక్స్ బహుళధ్రువ ప్రపంచం క్రమంగా క్షీణీస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచ సవాళ్లను పరిష్కరించడంలో బ్రిక్స్ కూటమి ప్రధానంగా వ్యవహరించాల్సి ఉందని ధోవల్ అభిప్రాయపడ్డారు. బహుళ ధ్రువ ప్రపంచ వ్యవస్థను నిర్మించే లక్ష్యంతో, ఎదుగుతున్న ఆర్థిక శక్తుల ఒక అనధికారిక కూటమిగా బ్రిక్స్ రూపుదిద్దుకుందన్నారు. ఆర్థిక సహకారాన్ని పెంపొందించడం, గ్లోబల్ సౌత్ స్వరాన్ని మరింత బలోపేతం చేయడం దీని ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. శాంతి, ప్రగతి, అభివృద్ధి, పరస్పర