
Sheikh Hasina : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆమె సన్నిహితులు ఏడుగురికి బంగ్లాదేశ్కు చెందిన ఒక కోర్టు మరణశిక్ష విధించింది. 2024లో జరిగిన అల్లర్ల సందర్భంగా ఏడుగురిని నిందితులుగా పరిగణిస్తూ బంగ్లాదేశ్కు చెందిన ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్-2 ఈ మరణశిక్ష ఖరారు చేసింది. మానవత్వానికి వ్యతిరేకంగా నిందితులు వ్యవహరించారని జస్టిస్ మొహమ్మద్ నజ్రుల్ ఇస్లాం చౌదరి తీర్పు వెల్లడించారు. 2024లో బంగ్లాదేశ్లో షేక్ హసీనా ఆధ్వర్యంలోని అవామీ లీగ్ ప్రభుత్వంపై ఆందోళనకారులు తిరగబడ్డ సంగతి తెలిసిందే. ఆందోళనల్ని అణచివేయడానికి ప్రభుత్వం కఠినంగా వ్యవహరించింది. ఈ సందర్భంగా ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరించిందని అక్కడి ప్రతిపక్షాలు, ఆందోళనకారులు అంటున్నారు. ముఖ్యంగా ఏడుగురు నిందితులు సమావేశమై, ఆందోళనల్ని అణచి వేసేందుకు కుట్రలు చేశారని, హింసకు పాల్పడ్డారని వారిపై అభియోగాలు నమోదయ్యాయి. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఏడుగురు నిందితులకు మంగళవారం మరణశిక్ష విధించింది. మాజీ ప్రధాని షేక్ హసీనాపై గత ఏడాదే ఇదే అంశంలో అక్కడి కోర్టు మరణశిక్ష విధించింది. ఇప్పుడు ఆమె అనుచరులకు శిక్ష పడింది. తాజాగా శిక్షకు గురైన వారిలో అవామీ లీగ్ పార్టీ ప్రధాన కార్యదర్శి, బంగ్లాదేశ్ మాజీ మంత్రి ఒబైదుల్ ఖాదర్, జాయింట్ సెక్రెటరీ బహవుద్దీన్ నసీమ్, మాజీ సమాచార మంత్రి అలీ అరాఫత్, జూబో లీగ్ చైర్మన్ షేక్ ఫాజిల్ షామ్స్ పరాష్, ఈ సంస్థ జనరల్ సెక్రెటరీ మైనుల్ హొసైన్ ఖాన్ నిఖిల్, బంగ్లాదేశ్ ఛాత్రా లీగ్ ప్రెసిడెంట్ సద్దాం హొసైన్, జనరల్ సెక్రెటరీ షేక్ వాలి అసిఫ్ ఉన్నారు.



