© 2026 nimisham.in
హైదరాబాద్ సనత్నగర్లోని మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) ఆసుపత్రి నేటి నుంచి ప్రజలకు అందుబాటులోకి రానుంది. తొలిసారిగా విదేశీ రోగుల కోసం ప్రత్యేక వార్డులను అందుబాటులోకి తీసుకురానున్నారు. తొలి విడతలో 582 పడకలతో ఈ సేవలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతుల మీదుగా ఈ సేవలను ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రులతో పోలిస్తే తక్కువ ఖర్చుతోనే విదేశీ రోగులకు వైద్య సేవలు అందించనున్నారు. రెండో విడతలో మరిన్ని సేవలను విస్తరించే అవకాశం ఉంది.పేదలకు పూర్తి ఉచితం.. ప్రత్యేకతలివే..టిమ్స్లో పేదలకు వైద్య సేవలు పూర్తిగా ఉచితంగా అందించనున్నారు. అదే సమయంలో ఆసుపత్రి నిర్వహణ, అధునాతన పరికరాల నిర్వహణ, మౌలిక వసతుల అభివృద్ధికి అవసరమైన నిధులను సమకూర్చేందుకు విదేశీ రోగుల నుంచి వచ్చే ఆదాయాన్ని వినియోగించాలని ప్రభుత్వం భావిస్తోంది. నిమ్స్ తరహాలో సుమారు 200 పడకలను పేయింగ్ రోగులకు కేటాయించనున్నారు. సనత్నగర్ టిమ్స్ను ప్రధాన వైద్య విభాగాలకు సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్గా తీర్చిదిద్దారు. మొత్తం 37 విభాగాల్లో సూపర్ స్పెషాలిటీ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. కొన్ని సంక్లిష్ట వ్యాధులకు అధునాతన చికిత్సలతోపాటు పరిశోధనలకు కూడా ప్రాధాన్యం ఇవ్వనున్నారు.తీవ్రమైన గుండె సంబంధిత వ్యాధులకు చికిత్స, క్లిష్టమైన శస్త్రచికిత్సల కోసం కార్డియాక్, థొరాసిక్ సైన్సెస్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. కిడ్నీ, లివర్, గుండె వంటి కీలక అవయవాల మార్పిడికి ప్రత్యేక విభాగాన్ని అందుబాటులోకి తెచ్చారు. మూత్రపిండాల వ్యాధుల చికిత్స, పరిశోధనల కోసం నెఫ్రాలజీ, యూరాలజీ ఎక్స్లెన్స్ సెంటర్ను కూడా ఏర్పాటు చేశారు. ప్రమాదాలు, అత్యవసర వైద్య పరిస్థితుల్లో తొలి గంట అత్యంత కీలకం కావడంతో టిమ్స్లో 24 గంటలపాటు పనిచేసే ట్రామా కేర్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. అత్యవసరంగా వచ్చిన రోగులను ఆలస్యం లేకుండా అవసరమైన విభాగాలకు తరలించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.ఆసుపత్రిలో 300కు పైగా ఇంటెన్సివ్ కేర్ యూనిట్ పడకలు ఉన్నాయి. సంక్లిష్టమైన చికిత్సలు, కీలక
శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు 16 అధునాతన ఆపరేషన్ థియేటర్లను ఏర్పాటు చేశారు. వీటిలో ఆధునిక వైద్య పరికరాలతోపాటు ఎంఆర్ఐ, సీటీ స్కాన్, రోబోటిక్ చికిత్స సదుపాయాలను అందుబాటులోకి తెచ్చారు. అవయవ మార్పిడి శస్త్రచికిత్సల కోసం అత్యాధునిక మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు, ప్రత్యేక ల్యాబొరేటరీలు, ఇన్ఫెక్షన్ నియంత్రిత ఐసీయూలు, ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశారు. తీవ్ర అనారోగ్యంతో ఉన్న రోగులను వేగంగా ఐసీయూ లేదా ఆపరేషన్ థియేటర్లకు తరలించేందుకు ప్రత్యేక రవాణా మార్గాలు, లిఫ్ట్లు ఏర్పాటు చేశారు. ఒక విభాగం నుంచి మరో విభాగానికి శాంపిళ్లను వేగంగా తరలించేందుకు ప్రత్యేక సాంకేతిక వ్యవస్థను కూడా సిద్ధం చేశారు.రూ.1,070 కోట్లతో భారీ వైద్య సముదాయంసనత్నగర్ టిమ్స్ ఆసుపత్రిని రూ.1,070 కోట్ల నిర్మాణ వ్యయంతో 22.6 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. మొత్తం మూడు బ్లాక్లు, ఐదు అంతస్తులతో కూడిన ఈ ఆసుపత్రిలో 1,082 పడకలు అందుబాటులో ఉన్నాయి. అధునాతన వైద్య సదుపాయాలు, సూపర్ స్పెషాలిటీ సేవలు, ఉచిత వైద్యం, విదేశీ రోగులకు తక్కువ ధరలో చికిత్స వంటి అంశాలతో టిమ్స్ను తెలంగాణలోనే కీలక ప్రభుత్వ వైద్య కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. విదేశీ రోగుల సేవల ద్వారా వచ్చే ఆదాయాన్ని మళ్లీ ఆసుపత్రి అభివృద్ధికి వినియోగించడం ద్వారా ప్రభుత్వ వైద్య వ్యవస్థకు కొత్త ఆదాయ మార్గం ఏర్పడే అవకాశం ఉంది.