
ఉత్తర తెలంగాణ ప్రాంత అభివృద్ధికి కీలకమైన రామగుండం–మణుగూరు రైల్వే లైన్ పురోగతిపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్తో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చర్చించారు. సుమారు రూ.4 వేల కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదించిన ఈ రైల్వే మార్గం ప్రస్తుత స్థితి, ప్రాజెక్టు పురోగతి, తదుపరి కార్యాచరణపై మంత్రి నుంచి వివరాలు తెలుసుకున్నారు. తెలంగాణలో రైల్వే మౌలిక వసతుల విస్తరణకు సంబంధించి పెండింగ్లో ఉన్న పలు అంశాలనుకూడా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీలు గడ్డం వంశీకృష్ణ, చామల కిరణ్కుమార్రెడ్డి, మల్లు రవి, సురేశ్ షెట్కార్ కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులు, పెండింగ్ పనులు, కొత్త మౌలిక వసతుల కల్పన, ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలపై విస్తృతంగా చర్చించారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన రైల్వే ప్రాజెక్టులను పరిశీలించి త్వరగా మంజూరు చేయడంతో పాటు ఇప్పటికే ప్రారంభమైన పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని కోరారు. రామగుండం–మణుగూరు రైల్వే లైన్ ఉత్తర తెలంగాణలోని పారిశ్రామిక, వాణిజ్య, రవాణా రంగాల అభివృద్ధికి అత్యంత కీలకమని ఎంపీ వంశీకృష్ణ కేంద్ర మంత్రికి వివరించారు. రామగుండం, పెద్దపల్లి, మంచిర్యాల ప్రాంతాల్లో ఇప్పటికే భారీ పరిశ్రమలు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, వాణిజ్య కార్యకలాపాలు విస్తరించి ఉన్న నేపథ్యంలో కొత్త రైల్వే మార్గం సరుకు రవాణాతో పాటు ప్రాంతీయ కనెక్టివిటీని మెరుగుపరిచే అవకాశం ఉందని పేర్కొన్నారు.ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన ముందుకు తీసుకెళ్లి క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఎంపీ కోరారు. రైల్వే మార్గం అందుబాటులోకి వస్తే పరిశ్రమలకు ముడిసరుకు, ఉత్పత్తుల రవాణా సులభతరం కావడంతో పాటు కొత్త పారిశ్రామిక పెట్టుబడులకు కూడా ఊతం లభించే అవకాశం ఉందని చెప్పారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఇప్పటికే మంజూరైన రైల్ ఓవర్ బ్రిడ్జిలు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు పనుల్లో జరుగుతున్న జాప్యాన్ని కూడా ఎంపీ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అవసరమైన నిధుల విడుదల, పనుల అమలులో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించి నిర్మాణాలను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల రైల్వే స్టేషన్లను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని కూడా ఎంపీ ప్రస్తావించారు. ప్రయాణికుల సంఖ్య, పారిశ్రామిక కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో స్టేషన్లలో మౌలిక వసతులు మెరుగుపరచడం, ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందించడం అవసరమని వివరించారు. తమ విజ్ఞప్తులపై కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ సానుకూలంగా స్పందించారని ఎంపీ వంశీకృష్ణ తెలిపారు. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో రైల్వే మౌలిక వసతులను బలోపేతం చేయడంపై నిరంతరం కేంద్రంతో సమన్వయం చేస్తానని చెప్పారు. రామగుండం–మణుగూరు రైల్వే లైన్తో పాటు ఆర్వోబీలు, ఎఫ్ఓబీలు, స్టేషన్ అప్గ్రేడేషన్ల వరకు ప్రతి అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి పనులు వేగంగా జరిగేలా కృషి చేస్తానని వెల్లడించారు.
Found this helpful?
Share this story with your network










