© 2026 nimisham.in
కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నియమించిన టెక్నికల్ ఓవర్సైట్ కమిటీ సూచనలు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) సిఫారసులకు లోబడే కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ చర్యలు చేపడుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్లతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ప్లానింగ్, డిజైన్, నిర్మాణం, ఆపరేషన్ లోపాల వల్లే ప్రమాదాలు జరిగాయని, ప్రస్తుత పరిస్థితుల్లో గేట్లు మూసి నీటిని నిల్వ చేయడం బ్యారేజీలకే కాకుండా దిగువ ప్రాంతాలకు తీవ్ర ప్రమాదకరమని ఎన్డీఎస్ఏ హెచ్చరించిందని వివరించారు. గోదావరిలో నీరు పారుతున్నప్పటికీ నీటిని ఎందుకు ఎత్తిపోయడం లేదనే అంశంపై కొందరు రాజకీయ లబ్ధి కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే బురదజల్లుతున్నారని ఆక్షేపించారు. విమర్శలు చేసేవారు ఎన్డీఎస్ఏ అధికారిక నివేదికను పరిగణలోకి తీసుకుని మాట్లాడితే బాగుండేదని వ్యాఖ్యానించారు.బ్యారేజీలలో నీటిని ఎత్తిపోయాలంటే కన్నెపల్లి నుండి అన్నారానికి పంపింగ్ చేయడానికి కనీసం 5 టీఎంసీల నీటిని నిరంతరంగా నిల్వ ఉంచాలని, అందుకు గేట్లు మూయడం సాంకేతికంగా తప్పనిసరని సీఎం పేర్కొన్నారు. అయితే, 2023లో మేడిగడ్డ 7వ బ్లాక్ పిల్లర్లు 1.2 మీటర్లు కుంగిపోవడం వల్ల మొత్తం బ్యారేజీ పునాదులు దెబ్బతిన్నాయని ఎన్డీఎస్ఏ తన 365 పేజీల నివేదికలో స్పష్టం చేసింది. గేట్లపై హైడ్రాలిక్ ఒత్తిడిని తట్టుకునే శక్తి లేనందున, మరమ్మతులు ముగిసేవరకు గేట్లు మూయవద్దని, అన్ని గేట్లను ఎత్తిపెట్టాలని నిపుణులు ఆదేశించారని తెలిపారు. ఇటువంటి స్థితిలో గేట్లు మూసి నీటిని నిల్వచేస్తే భద్రాచలం పట్టణం వరదలతో ముంచెత్తవచ్చని, ఊర్లకు ఊర్లు కొట్టుకుపోయే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. చట్టబద్ధమైన డ్యామ్ సేఫ్టీ యాక్ట్-2021 ప్రకారం కేంద్ర అథారిటీ నివేదికలను ఏ రాష్ట్రమైనా పాటించాల్సిందేనని స్పష్టం చేశారు.ఈ బ్యారేజీల స్థిరీకరణకు 2026 జూన్ 30న కేంద్రం జాతీయ, రాష్ట్ర నిపుణులతో టెక్నికల్
ఓవర్సైట్ కమిటీని ఏర్పాటు చేసిందని వివరించారు. ఎన్డీఎస్ఏ తుది నివేదికను పరిగణలోకి తీసుకుని ఈ కమిటీ సూచనలను తూ.చ తప్పకుండా పాటిస్తామన్నారు. నిజానికి ఈ ప్రాజెక్టుకు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టే అసలైన గుండెకాయ అని, దాని ఆధారంగానే ఇప్పుడు ప్రాజెక్టు సాగుతోందని గుర్తుచేశారు. ప్రాజెక్టు ప్రారంభించిన 11 నెలల్లోనే లోపాలు ఉన్నాయని ఆనాటి ఈఈ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీకి లేఖ రాసినా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని సీఎం ఆరోపించారు. ఈ నెలలో టెస్టింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ముంబయి ఐఐటీ, అంతర్జాతీయ నిపుణుల సూచనల మేరకు ఎలాంటి దురుద్దేశాలు లేకుండా పారదర్శకంగా పునరుద్ధరణ పనులు ప్రారంభిస్తామని, ఎన్డీఎస్ఏకు ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.