
IPL 2027: ఐపీఎల్‌లో మరోసారి దారుణంగా విఫలమై కనీసం ప్లేఆఫ్స్‌కు కూడా అర్హత సాధించలేకపోయిన ఢిల్లీ క్యాపిటల్స్ (DC) యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకుంది. దశాబ్దాలుగా ట్రోఫీ దక్కక తీవ్ర తీవ్ర నిరాశలో ఉన్న ఢిల్లీ, ఐపీఎల్ 2027 కోసం కోచింగ్ స్టాఫ్‌ను పూర్తిగా ప్రక్షాళన చేస్తూ దిగ్గజాల దండయాత్రకు తెరలేపింది. భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనుండగా, సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్‌ను అసిస్టెంట్ కోచ్‌గా నియమిస్తూ మైండ్ బ్లాకింగ్ ప్లాన్ వేసింది.
చమిండ వాస్, అమిత్ మిశ్రా విధ్వంసకర ఎంట్రీ:
గంగూలీ, యువరాజ్ మాత్రమే కాకుండా శ్రీలంక 1996 వరల్డ్ కప్ విన్నర్, లెజెండరీ పేసర్ చమిండ వాస్‌ను ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా, ఐపీఎల్‌లో 174 వికెట్లు తీసిన స్టార్ స్పిన్నర్ అమిత్ మిశ్రాను స్పిన్ బౌలింగ్ కోచ్‌గా ఢిల్లీ క్యాపిటల్స్ రంగంలోకి దించుతోంది. దక్షిణాఫ్రికా లీగ్ (SA20) లో ప్రిటోరియా క్యాపిటల్స్‌ను ఫైనల్‌కు తీసుకెళ్లిన గంగూలీ అనుభవం, రిషభ్ పంత్, అభిషేక్ శర్మ లాంటి యంగ్ స్టార్లకు మెంటార్‌గా వ్యవహరించిన యువరాజ్ సింగ్ అగ్రెసివ్ మైండ్‌సెట్ ఢిల్లీకి కొత్త ఊపిరి పోస్తాయని ఫ్రాంచైజీ భావిస్తోంది.
అక్షర్ పటేల్ కెప్టెన్సీ ఊడటం ఖాయం:
కోచింగ్ స్టాఫ్‌తో పాటు కెప్టెన్సీలోనూ ఢిల్లీ క్యాపిటల్స్ ఊహించని మార్పుకు శ్రీకారం చుట్టబోతోంది. వరుస పరాజయాలతో జట్టును నడిపించడంలో విఫలమైన అక్షర్ పటేల్‌ను కెప్టెన్సీ నుంచి ఊడబీకేందుకు మేనేజ్‌మెంట్ సిద్ధమైంది. అక్షర్ స్థానంలో ఐపీఎల్‌లో సుదీర్ఘ నాయకత్వ అనుభవం ఉన్న కేఎల్ రాహుల్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే ఆలోచనలో ఢిల్లీ యాజమాన్యం ఉన్నట్లు సమాచారం.
తొలి టైటిల్ వేటలో దిగ్గజాల జోడీ:
గతంలో ఢిల్లీకి మెంటార్‌గా వ్యవహరించిన గంగూలీ, ఇప్పుడు పూర్తిస్థాయి హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపడుతుండటంతో జట్టు స్వరూపం మారడం ఖాయంగా కనిపిస్తోంది. ఐపీఎల్‌లో 132 మ్యాచ్‌లు ఆడి 2,750 పరుగులు చేసిన యువరాజ్ సింగ్ అధికారికంగా ఒక ఐపీఎల్ ఫ్రాంచైజీకి కోచ్‌గా మారడం ఇదే తొలిసారి. ఈ దిగ్గజాల కాంబినేషన్ ఢిల్లీ క్యాపిటల్స్ సుదీర్ఘ టైటిల్ నిరీక్షణకు తెరదించుతుందో లేదో వేచి చూడాలి.






