
కేంద్ర రాజకీయాల్లో త్వరలో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశాలపై ఢిల్లీలో (Delhi) చర్చ జరుగుతోంది. కేంద్ర మంత్రివర్గంలో మార్పులు, విస్తరణకు సంబంధించిన ఊహాగానాల మధ్య కొన్ని రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించే అంశం కూడా తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ (TDP) నుంచి సీనియర్ నాయకుడికి రాజ్యాంగ పదవి దక్కవచ్చనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది. ఎన్డీఏ (NDA)లో టీడీపీ కీలక భాగస్వామిగా కొనసాగుతున్న నేపథ్యంలో ఆ పార్టీకి ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర నాయకత్వం భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు (Yanamala Ramakrishnudu) పేరును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పరిశీలనకు ప్రతిపాదించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారికంగా స్పష్టత రాలేదు. గవర్నర్ పదవి ఖరారైందన్న వార్తలు కూడా ప్రస్తుతం రాజకీయ చర్చల స్థాయిలోనే ఉన్నాయి. యనమల రామకృష్ణుడు టీడీపీలో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్గా పనిచేసిన ఆయన, ఆ తర్వాత రాష్ట్ర మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. ముఖ్యంగా ఆర్థిక శాఖను నిర్వహించిన సమయంలో కీలక నిర్ణయాల్లో భాగస్వామిగా ఉన్నారు. శాసనసభ వ్యవహారాలు, రాజ్యాంగపరమైన అంశాలపై ఆయనకు ఉన్న అవగాహనను పార్టీ వర్గాలు ప్రస్తావిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో గవర్నర్ల పదవీకాలం పూర్తవడం, మరికొన్ని చోట్ల రాజకీయంగా కీలకమైన పరిణామాలు చోటుచేసుకోవడం నేపథ్యంలో కేంద్రం కొత్త నియామకాలపై దృష్టి పెట్టినట్లు సమాచారం. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh), కర్ణాటక (Karnataka), తమిళనాడు (Tamil Nadu), కేరళ (Kerala), బీహార్ (Bihar) వంటి రాష్ట్రాలకు సంబంధించి గవర్నర్ల మార్పుపై చర్చ సాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో యనమలకు ఏదైనా రాష్ట్ర గవర్నర్ బాధ్యతలు అప్పగిస్తే ఆయన అనుభవాన్ని ఉపయోగించుకోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లేదా బీహార్ వంటి పెద్ద రాష్ట్రాలకు రాజ్యాంగ వ్యవహారాలపై అవగాహన ఉన్న వ్యక్తి అవసరమనే వాదన వినిపిస్తోంది