
వివాహేతర సంబంధం ఓ కుటుంబంలో చిచ్చురేపింది. ప్రియుడితో కలిసి భర్తను చంపిన ఓ మహిళ.. దీనిని చూసిన తన కన్న కొడుకును కూడా కడతేర్చింది. బంధువుల ఇంటికి వెళ్లి భోజనం చేసిన వచ్చిన తర్వాత ఊపిరాడక తన భర్త, కుమారుడు చనిపోయారని కట్టుకథ అల్లింది. చివరకు కుటుంబసభ్యుల అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. మానవత్వానికి మాయనిమచ్చలాంటి ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరు సమీపంలో చోటుచేసుకుంది. ఇద్దర్నీ హత్యచేసి సహజ మరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన మహిళను, ఆమె ప్రియుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.వివరాల్లోకి వెళ్తే.. చిక్కబనవరకు చెందిన అభినందన్ (35), హరిణి (26) భార్యాభర్తలు. వీరికి నాలుగేళ్ల కుమారుడు యదువీర్ ఉన్నాడు. కనకపుర తాలూకా హారోహళ్లికి చెందిన ప్రయివేట్ ఉద్యోగి వినయ్తో ఆమె ఇన్స్టాగ్రామ్లో ఏర్పడిన పరిచయం, వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం తెలిసిన భర్త అభినందన్.. భార్యను మందలించాడు. దీనిపై ఇరువురి మధ్య పలుసార్లు గొడవ జరిగింది. ప్రవర్తన మార్చుకోకుంటే విడాకులు ఇస్తానని బెదిరించాడు. అయినా సరే ఆమె మారలేదు సరికదా.. భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలసి పథకం వేసింది.ఆదివారం రాత్రి అభినందన్ నిద్రపోయిన అనంతరం వినయ్ను రప్పించి తన ప్లాన్ను అమలు చేసింది. భర్త అభినందన్ కాళ్లను ఆమె పట్టుకోగా, తలపై కుక్కరుతో కొట్టి, గొంతు నులిమి వినయ్ హత్య చేశాడు. పెనుగులాటలో తండ్రి అరుపులు విని కుమారుడు యదువీర్ అక్కడకు వచ్చాడు. ప్రత్యక్షంగా తమ నేరాన్ని చూసిన చిన్నారి.. ఈ విషయాన్ని బయటపెడితే దొరికిపోతామని భావించిన ఇద్దరూ కలిసి గొంతును నులిమి ప్రాణాలు తీశారు. రక్తం మరకలు ఉన్న దుస్తులను మార్చి.. భర్త గుండెలపై కుమారుడ్ని నిద్రపుచ్చింది. భర్తే కొడుకును చంపి, ఆత్మహత్య చేసుకున్నాడని నమ్మించే ప్రయత్నం చేసింది.పథకం ప్రకారం ఇంటిలోని సీసీటీవీ కెమెరాను ఆఫ్ చేసి, ప్రియుడు వినయ్ వెళ్లిన అనంతరం ఆన్ చేసింది. ఆ తర్వాత ఏమీ తెలియనట్టు పోలీస్ కంట్రోల్ రూమ్కి సోమవారం ఉదయం 7 గంటలకు ఫోన్ చేసి తన భర్త, కుమారుడు మంచంపై స్పృహలేకుండా పడి ఉన్నారని సమాచారం ఇచ్చింది. దీంతో పోలీసులు చేరుకుని ఇరువురినీ పరీక్షించగా.. అప్పటికే మృతిచెందారు.కుటుంబసభ్యుల ఆమెపై అనుమానం వ్యక్తం చేస్తూ.. మూడు నెలల కిందటే ప్రియుడితో వెళ్లిపోయి కొద్ది రోజుల అనంతరం తిరిగి వచ్చిందని పోలీసులకు చెప్పారు. దీంతో హరిణిని అదుపులోకి తీసుకుని ఆరు గంటల పాటు పోలీసులు విచారించడంతో గుట్టురట్టయ్యింది. ఆమె ఇచ్చిన సమాచారంతో వినయ్ను అరెస్ట్ చేశారు. సీసీటీవీ కెమెరా ఆఫ్ చేయడం, ఫోన్లో మెసేజ్లు, ఛాటింగ్ డిలీట్ చేయడం, రక్తం మరకలున్న దుస్తులను ఉతికి ఆరేసినట్టు గుర్తించారు.అభినందన్కు ఉన్న కోట్ల విలువైన ఆస్తులు ఈ హత్యకు ప్రధాన కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. తల్లిదండ్రులకు ఒకే కొడుకైన అభినందన్కు చిక్కబానవరలో మూడంతస్తుల భవనంతో పాటు కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. అతడ్ని అంతమొందిస్తే ఆ ఆస్తిని దక్కించుకోవచ్చని హరిణి, వినయ్ పథకం పన్నినట్లు తెలుస్తోంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు.. రిపోర్ట్ వచ్చిన తర్వాత మరణానికి గల ఖచ్చితమైన కారణాలు తెలుస్తాయని వివరించారు.





