
ప్రముఖ నటుడు బాబూమోహన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన జీవితంలోని కొన్ని కఠినమైన, మధురమైన జ్ఞాపకాలను పంచుకున్నారు. దివంగత నటి సౌందర్యతో తన అనుబంధం గురించి వివరంగా వెల్లడించారు. బాబూమోహన్ తన పెద్ద కుమారుడి అకాల మరణాన్ని గుర్తు చేసుకున్నారు. మద్రాసులో ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని, పరీక్షలు రాసి తిరిగి వచ్చిన తన కుమారుడు హాలిడేస్లో ఉండగా జరిగిన బైక్ ప్రమాదం తన జీవితంలో చీకటి రోజు అని అన్నారు. ఆ తర్వాత చినుకు చినుకు పాటతో నటి సౌందర్యతో తన అనుబంధాన్ని బాబూమోహన్ ప్రస్తావించారు. ఈ పాట కేవలం ఒక సినిమాకు సంబంధించింది కాదని, వారిద్దరూ కలిసి ఐదు, ఆరు చిత్రాలలో నటించారని గుర్తు చేసుకున్నారు. ఒక దశలో కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం తమతో నటించడానికి అభ్యంతరం చెప్పారని వార్తలు వచ్చాయని, అయితే నిర్మాతలు తనను కంపల్సరీగా కావాలని పట్టుబట్టారని తెలిపారు. దీంతో కథలను మార్చి, తనకు ప్రత్యేకంగా పాటలను జోడించారని, డిస్కో శాంతి, సిల్క్ స్మిత, జయలలిత వంటి వారితో తాను నటించాల్సి వచ్చిందని వెల్లడించారు. ఈ పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయని పేర్కొన్నారు. చివరికి దాసరి నారాయణరావు ముగ్గురినీ కలిసి నటించమని ఒప్పించారని వివరించారు.





