
మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలో మంగళవారం సాయంత్రం ఓ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చెంబూర్ పరిధిలోని రోడ్ నంబర్ 11 వద్ద ప్రయాణిస్తున్న ఓ స్కూల్ బస్సుపై అకస్మాత్తుగా ఓ భారీ వృక్షం విరిగిపడింది.
ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 13 మంది పాఠశాల విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. ఈ ఊహించని ప్రమాదంలో దాదాపు 10 మంది చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, రెస్క్యూ బందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన 10 మంది విద్యార్థులను అత్యవసరంగా సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే బస్సుపై భారీ వృక్షం బలంగా పడటంతో ఓ విద్యార్థి ఇప్పటికే బస్సు లోపలే ఇరుక్కుపోయి ఉన్నాడని అధికారులు వెల్లడించారు. ఆ చిన్నారిని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి రెస్క్యూ బృందాలు ప్రస్తుతం తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
ఈ ఘోర ప్రమాదంపై స్థానిక నివాసితులు బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సదరు వీధిలోని ప్రమాదకరమైన చెట్లను తొలగించాలని తాము గతంలోనే బీఎంసీకి పదే పదే బీఎంసీకి పదే పదే లేఖలు రాశామని స్థానికులు ఆరోపించారు. గతంలో కూడా ఈ ప్రాంతంలో ఇలాంటి ఘటనే ఒకటి జరిగిందని.. అయినప్పటికీ మున్సిపల్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇప్పుడు ఇంతటి ప్రమాదం జరిగిందని వారు మండిపడుతున్నారు.
మరోవైపు ముంబై నగరం, దాని శివారు ప్రాంతాల్లో ఈ రోజు భారీ వర్షాలు, ఉరుములతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. వర్షాల తీవ్రతకు చెట్లు కూలే ప్రమాదం ఉన్నందున ప్రజలు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.