
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ సాధిస్తున్న ప్రగతిపై కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రశంసల జల్లు కురిపించారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న గ్రామీణ అభివృద్ధి పథకాలను క్షేత్రస్థాయిలో వేగంగా, పారదర్శకంగా అమలు చేయడంలో ఏపీ ప్రభుత్వం చూపుతున్న చొరవను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘వికసిత్ భారత్ గ్రామీణ్ యోజన’ అమలుకు సంబంధించిన ప్రాథమిక ప్రక్రియలలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అందరికంటే ముందుందని కేంద్ర మంత్రి వెల్లడించారు.
ఈ పథకానికి అవసరమైన రాష్ట్ర స్థాయి అధికారిక నోటిఫికేషన్ను ఏపీ ప్రభుత్వం ఇప్పటికే విజయవంతంగా పూర్తి చేసింది. అంతేకాకుండా, పథకం అమలుకు కీలకమైన బడ్జెట్ కేటాయింపులు జరపడంతో పాటు, నిధుల నిర్వహణకు సంబంధించిన ప్రత్యేక బడ్జెట్ హెడ్ సృష్టిని కూడా వేగంగా పూర్తి చేసి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. గ్రామీణ ప్రాంతాలలో రోడ్ల అనుసంధానాన్ని పెంచేందుకు ఉద్దేశించిన ‘పీఎం-గ్రామ సడక్ యోజన’ (PMGSY) పథకం కింద నిర్మిస్తున్న రహదారుల నాణ్యతలో ఏపీ అత్యుత్తమ స్థానాన్ని దక్కించుకుందని శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు.
క్వాలిటీ మెయింటైన్ చేయడంలో దేశంలోనే బెస్ట్ రాష్ట్రాల జాబితాలో ఏపీ నిలిచింది. ఈ అద్భుతమైన పనితీరుకు గుర్తింపుగా.. జులై 2న దేశవ్యాప్తంగా ప్రారంభం కానున్న ‘వికసిత్ భారత్ గ్రామీణ్ యోజన (VB G RAM G)’ పథకం జాతీయ ప్రారంభోత్సవ వేడుకలకు ఆతిథ్య రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను ఎంపిక చేసినట్లు కేంద్ర మంత్రి ప్రకటించారు. ఆధ్యాత్మిక నగరం తిరుపతి వేదికగా ఈ మెగా స్కీం ఘనంగా ప్రారంభం కానుంది.