
రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Anant Ambani Tirumala Donation: తిరుమల కోసం రూ.27.5 కోట్ల విలువైన ఎలక్ట్రిక్ బస్సులను ప్రకటించిన అనంత్ అంబానీ.. ఈ బస్సుల నిర్వహణ కోసం అవసరమైన 50 మంది డ్రైవర్ల వేతనాలను రిలయన్స్ సంస్థే భరిస్తుందని, వీటి కోసం ప్రత్యేక ఇ-ఛార్జింగ్ స్టేషన్లను కూడా తిరుమలలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవే.
ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన తిరుమల శ్రీవారి భక్తుల సౌకర్యార్థం అంబానీ వారసుడు అద్భుతమైన కానుకను ప్రకటించారు. అనంత అంబానీ నేడు సుప్రభాత సేవలో పాల్గొని, భక్తుల రవాణా వ్యవస్థను మెరుగుపరిచే దిశగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుమలలో ప్రతిరోజూ వచ్చే వేలాది మంది భక్తుల రవాణా కోసం ఈ అధునాతన ఎలక్ట్రిక్ బస్సులు ఎంతగానో ఉపయోగపడతాయి. భక్తుల సంఖ్య నిరంతరం పెరుగుతున్న నేపథ్యంలో, ఈ బస్సులు ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడమే కాకుండా, పర్యావరణానికి కూడా మేలు చేస్తాయి.
ఈ భారీ విరాళం వల్ల తిరుమలలో కాలుష్యం తగ్గుతుంది. భక్తులకు మెరుగైన ప్రయాణ సౌకర్యాలు అందుతాయి. బస్సులతో పాటు డ్రైవర్ల జీతాలను కూడా రిలయన్స్ భరించడం వల్ల టీటీడీపై భారం తగ్గుతుంది. ఈ ఎలక్ట్రిక్ బస్సుల ద్వారా తిరుమలలో గ్రీన్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుంది.
మరోవైపు, తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. వరుసగా మూడు రోజులు సెలవులు ఉండటంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. సోమవారం విఐపి బ్రేక్ దర్శనాలను రద్దు చేయడంతో పాటు, ఆదివారం సిఫార్సు లేఖలను కూడా స్వీకరించడం లేదు. ఆన్లైన్ ఏ-రోజుకారోజే బుకింగ్ ద్వారా వచ్చిన 800 శ్రీవారి దర్శన టికెట్లను కూడా సోమవారం రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. క్యూ కాంప్లెక్స్ నిండిపోవడంతో భక్తులు బయట వేచి ఉండాల్సి వస్తోంది. భక్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని టీటీడీ ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.
భక్తుల సౌకర్యార్థం టీటీడీ చర్యలు చేపట్టింది. అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి శనివారం రాత్రి క్యూ లైన్లను పరిశీలించారు. సాధారణ రోజుల్లో 85 వేల మంది భక్తులు వస్తుంటే, శనివారం లక్ష మందికి పైగా రావడం గమనించారు. పరిస్థితిని నియంత్రించడానికి అధికారులు సిబ్బంది సెలవులను రద్దు చేసి, అదనపు పోలీసు బలగాలను మోహరించారు. సోమవారం విఐపి దర్శనాలు, ఆన్లైన్ బుకింగ్లను రద్దు చేయడం ద్వారా, ఆ సమయాన్ని సర్వదర్శనం భక్తుల కోసం కేటాయించనున్నట్లు టీటీడీ వివరించింది. దీంతో సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తోందని మరోసారి దేవస్థానం నిరూపించింది.
ప్రస్తుతం తిరుమలలో ఉచిత సర్వదర్శనం కోసం 30 గంటల సమయం పడుతోంది. SSD దర్శన టైమ్ స్లాట్కు కూడా 18-30 గంటల సమయం, అలాగే శ్రీవారి ప్రత్యేక దర్శనం కోసం రూ.300 టికెట్తో 10 గంటల సమయం పడుతుంది. నిన్న ఒక్కరోజే 85 వేల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.. అందులో 44 వేల మందికి పైగా తలనీలాలు సమర్పించారు. నిన్నటి ఒక్క రోజులోనే స్వామివారికి రూ.3.76 కోట్ల హుండీ ఆదాయం వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. ఈ నేపథ్యంలో తిరుమలలోని వైకుంఠం ఇతర అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.