ఆంధ్రప్రదేశ్లో ట్రెండ్ మారుతోంది.. కొంతకాలంగా ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్లకు డిమాండ్ పెరుగుతోంది. ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో నో అడ్మిషన్ బోర్డులు కనిపిస్తున్నాయి.
సర్కారీ బడులు మాత్రమే కాదు హాస్టల్స్లో కూడా అడ్మిషన్ల కోసం పోటీ పెరిగింది. అనకాపల్లి జిల్లాలోని ఆ ప్రభుత్వ హాస్టల్లో సీటు అంత ఈజీ కాదు.. ఎంపీ, ఎమ్మెల్యేలతో రికమండేషన్ చేయిస్తారు. కొంతకాలంగా ఈ హాస్టల్లో సీటు కోసం పిల్లలు, తల్లిదండ్రులు క్యూ కడుతున్నారు. అడ్మిషన్లు లేవని అక్కడి సిబ్బంది చెప్పడంతో నిరాశతో వెనక్కు వెళుతున్నారు. దీన్ని బట్టి ఆ హాస్టల్లో సీటు కోసం ఎంత డిమాండ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. అనకాపల్లిలోని బీసీ బాలుర హాస్టల్లో సీటు కోసం తల్లిదండ్రులు క్యూ కట్టారు. ఏకంగా ఎమ్మెల్యే, ఎంపీల లెటర్లు ఇచ్చారు.. పిల్లలకు సీటు కావాలంటూ అడుతున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా హాస్టల్కు ఈ ఏడాది విద్యార్థుల ప్రవేశాలు పెరగాయి.. దీంతో సీట్లు సర్దుబాటు చేయడం సిబ్బందికి తలనొప్పిగా మారిందని చెబుతున్నారు. హాస్టల్లో సీట్లు మొత్తం భర్తీ అయ్యాయని.. దయచేసి ఎవరూ రావద్దని సిబ్బంది చెబుతున్నారు. ఎమ్మెల్యే, ఎంపీల సిఫార్సు లేఖలతో వచ్చినా ఫలితం లేదని చెప్పి పంపిస్తున్నారు. ప్రభుత్వ హాస్టల్లో సీట్ల కోసం డిమాంగ్ పెరగడం ఆసక్తికరంగా మారింది. అనకాపల్లిలోని ప్రభుత్వ బీసీ బాలుర హాస్టల్లో 3వ తరగతి నుంచి పదో తరగతి వరకు 140 సీట్లు అందుబాటులో ఉన్నాయి. కానీ హాస్టల్లో ఇప్పటికే 160 మంది చేరారు. అయినా సరే సీటు కావాలంటూ ఎంపీ, ఎమ్మెల్యే సిఫార్సు లేఖలతో తల్లిదండ్రులు హాస్టల్ దగ్గరకు వస్తున్నారని చెబుతున్నారు.గతంలో ఈ హాస్టల్ భవనం శిథిలావస్థకు చేరగా.. గత ప్రభుత్వ హయాంలో ఎంపీ నిధులు రూ.20 లక్షలతో మరమ్మతు పనులు చేపట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎస్ఆర్ కింద ఫైజర్ కంపెనీ రూ.28 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టింది. హాస్టల్కు శ్లాబ్ వేసి, అన్ని రిపీర్లే చేయించి సుందరంగా తీర్చిదిద్దారు. రామ్ కో కూడా సీఎస్ఆర్ నిధులు రూ.15 లక్షలతో రెండు గదుల్ని నిర్మించింది. విద్యార్థులు చదువుకోవడానికి, నిద్రించడానికి గదులు.. మురుగుదొడ్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రతి రోజూ సాయంత్రం ట్యూటర్లతో విద్యార్థులకు బోధనచేయిస్తున్నారు. అంతేకాదు ఈ హాస్టల్లో ఉన్న పదో తరగతి విద్యార్థులు 22 మందిలో 21 మంది ఉత్తీర్ణత సాధించారు. అంతేకాదు 21మందిలో ముగ్గురికి 500కిపైగా మార్కులు వచ్చాయి. అనకాపల్లి హాస్టల్లో సౌకర్యాలు బావున్నాయని విద్యార్థులు చెబుతున్నారు.. అందుకే ఈ ఏడాది బీసీ బాలుర హాస్టల్లో సీట్లకు డిమాండ్ పెరిగిందని చెబుతున్నారు.