Newlywed Bride Hilltop Fall : తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో శనివారం అత్యంత విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. దైవదర్శనం కోసం భర్తతో కలిసి కొండపై ఉన్న ఆలయానికి వెళ్లిన ఓ నవవధువు..
కోతులు ఒక్కసారిగా చుట్టుముట్టడంతో ప్రాణభయంతో కంగారుపడి, కొండపై నుంచి కిందకు పడిపోయి ప్రాణాలు కోల్పోయింది. పెళ్లయిన కేవలం నెల రోజులకే ఈ ఘోర ప్రమాదం జరగడంతో ఇరు కుటుంబాలలో తీవ్ర శోకసంద్రం నెలకొంది.ఆలయ దర్శనంలో ఘోరంపోలీసుల కథనం ప్రకారం.. తూత్తుకుడి జిల్లా పరిధిలోని సౌత్ తిట్టాంకుళం ప్రాంతానికి చెందిన 24 ఏళ్ల అనితకు, అదే జిల్లాకు చెందిన 29 ఏళ్ల సురేష్ అనే యువకుడితో గత నెలలోనే అత్యంత ఘనంగా వివాహం జరిగింది. సురేష్ విదేశాల్లో ఉద్యోగం చేస్తుండగా.. వివాహం కోసమే ఇటీవల స్వగ్రామానికి వచ్చాడు. శనివారం ఉదయం ఈ నూతన వధూవరులు ఇద్దరూ కలిసి స్థానికంగా ప్రసిద్ధి చెందిన కజుగుమలైలోని 'కలుగాసలమూర్తి దేవాలయానికి' వెళ్లారు. అక్కడ ప్రధాన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం.. కొండపై భాగంలో ఉన్న అత్యంత ఎత్తైన ఉచ్చిప్పిళ్లయార్ స్వామి వారి సన్నిధిని దర్శించుకోవడానికి మెట్ల మార్గం గుండా పైకి చేరుకున్నారు.కోతుల గుంపు చుట్టుముట్టడంతో..!కొండపైకి చేరుకున్న ఈ జంట.. అక్కడ చెట్లపై ఉన్న కోతులకు తమ వద్ద ఉన్న పండ్లను తినిపించడం ప్రారంభించారు. అయితే ఆహారం కోసం అక్కడ ఉన్న వానరాలు ఒక్కొక్కటిగా పెద్ద సంఖ్యలో వారి వైపు దూసుకొచ్చాయి. క్షణాల వ్యవధిలోనే కోతుల గుంపు అనితను పూర్తిగా చుట్టుముట్టాయి. వాటి అరుపులకు, దూకుడుకు ఆమె తీవ్ర భయాందోళనకు గురైంది. ఆ మత్తులో ప్రాణాలు కాపాడుకోవడానికి వెనకడుగు వేస్తూ అదుపు తప్పడంతో.. ఒక్కసారిగా వందల అడుగుల లోతున్న కొండపై నుంచి కిందకు పడిపోయింది. తీవ్రమైన గాయాలవ్వడంతో అనిత ఘటనా స్థలంలోనే కన్నుమూసింది. కళ్ల ముందే భార్య లోయలో పడిపోవడంతో భర్త సురేష్ గుండె పగిలేలా రోదించిన దృశ్యాలు అక్కడ ఉన్న వారిని కన్నీరు పెట్టించాయి.రంగంలోకి రెస్క్యూ టీమ్.. కేసు నమోదుఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే కజుగుమలై అగ్నిమాపక, రెస్క్యూ సర్వీసెస్ సిబ్బందితో పాటు స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అత్యంత శ్రమతో లోయ నుంచి అనిత మృతదేహాన్ని వెలికితీసి, శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. "కోతులు చుట్టుముట్టడంతో ఆమె ఒక్కసారిగా పానిక్ అయ్యిందని, దానివల్లే బ్యాలెన్స్ తప్పి కిందపడిపోయినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నాం" అని పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు. పర్యాటకులు కొండ ప్రాంతాలలో ఉన్న జంతువులకు ఆహారం ఇచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.