
పాస్పోర్టు, పౌరసత్వ అంశంపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మండిపడ్డారు.
ఇంటర్నెట్ విభాగం: పాస్పోర్టు, పౌరసత్వ అంశంపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మండిపడ్డారు. ప్రఖ్యాత విదేశీ సంస్థలో చదువుకున్న వ్యక్తిగా, భారత చట్టాల్లోని ప్రాథమిక సూత్రాలను సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం విచారకరమన్నారు. ‘విదేశాంగ మంత్రిత్వ శాఖ వివరణ ప్రకారం.. భారత పాస్పోర్టుకు విలువ లేదని అర్థం కాదు.. పాస్పోర్టు ఒక్కటే భారత పౌరసత్వాన్ని నిర్ధారించే ఆధారం కాదని మాత్రమే ఆ శాఖ చెప్పింది’ అని ఓ ప్రకటనలో కిషన్రెడ్డి వివరించారు. ‘ప్రజా జీవితంలో, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న నాయకులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల్లో ఆందోళన కలిగేలా కాకుండా.. బాధ్యతతో మాట్లాడాలి. చట్టపరమైన సూత్రాలను ఉద్దేశపూర్వకంగా తప్పుగా చిత్రీకరించడం ఆమోదయోగ్యం కాదు. నిరాధార వ్యాఖ్యలు చేయడానికి ముందుగా.. పౌరసత్వ చట్టం-1955, పాస్పోర్ట్స్ చట్టం-1967ను ముందుగా చదవాలి’ అని ఒవైసీకి హితవు పలికారు.