
ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్లోని అణు శక్తి కేంద్రాల్లో తనిఖీలు చేపడతామంటూ అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (IAEA) చీఫ్ గ్రోసీ చేసిన ప్రకటనను ఇరాన్ దౌత్యవేత్తలు ఖండించారు.
అమెరికాతో తుది ఒప్పందం (US-Iran deal) కుదిరే వరకు ఎటువంటి తనిఖీలకు అనుమతి లేదని ఆ దేశ మంత్రి కజెమ్ ఘరీబాబాదీ తెలిపారు. ఈ విషయంపై గతంలో గ్రోసీ తమకు విజ్ఞప్తి చేశారని.. కానీ స్విట్జర్లాండ్లో ఆయనతో ఎటువంటి సమావేశం జరగలేదని పేర్కొన్నారు. అణు పదార్థాన్ని పరిశీలించేందుకు అనుమతించే ప్రణాళిక ఏదీ తమ వద్ద లేదని.. మీడియాలో హడావిడి సృష్టించడం ద్వారా ఏమీ సాధించలేరని అన్నారు. అమెరికా తీసుకునే ఆచరణాత్మక చర్యలను పరిశీలించిన తర్వాత అణు తనిఖీల విషయంలో ఓ నిర్ణయానికి వస్తామన్నారు.
అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం.. టెహ్రాన్లోని అణు శుద్ధి (enrichment) కేంద్రాలను తప్పకుండా తమ బృందం సందర్శిస్తుందని ఐక్యరాజ్యసమితి అణు సంస్థ అధిపతి బుధవారం వెల్లడించారు. అయితే, అవి రేపు జరుగుతాయా? మరో వారం రోజుల్లోనా అనేది ముఖ్యం కాదని పేర్కొన్నారు. మరోవైపు, తాము చేసుకున్న ఒప్పందానికి ఇరాన్ కట్టుబడి ఉందో, లేదో ధ్రువీకరించేందుకు అణు తనిఖీ అధికారులు ఇరాన్ను సందర్శిస్తారని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇప్పటికే వెల్లడించారు. ఇదీ చదవండి: వచ్చే నెలలో ఖమేనీ అంత్యక్రియలు.. మోదీకి పిలుపు
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.