
తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకకు వరప్రదాయినిగా ఉన్న తుంగభద్ర ప్రాజెక్టు(Thungabhadra) చరిత్రలో రేపు ఒక కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది.
ప్రాజెక్టు భద్రత, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేలా నిర్మించిన 33 కొత్త క్రస్ట్ గేట్లను గురువారం అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. గతంలో జరిగిన ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) ఇచ్చిన సాంకేతిక నివేదిక ఆధారంగా ఈ ఆధునీకరణ పనులు చేపట్టారు.
ప్రాజెక్టులో ఉన్న పాత గేట్ల స్థానంలో సరికొత్త సాంకేతికతతో కూడిన 33 క్రస్ట్ గేట్లను రూ. 51 కోట్ల వ్యయంతో సిద్ధం చేశారు. ఇంజనీరింగ్ అధికారులు అహోరాత్రులు శ్రమించి, కేవలం 6 నెలల స్వల్ప వ్యవధిలోనే గేట్ల తయారీ, అమరిక ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడం విశేషం. గుర్తుండే ఉంటుంది.. 2024 ఆగస్టులో వచ్చిన భారీ వరద ప్రవాహానికి తుంగభద్ర డ్యామ్ 19వ క్రస్ట్ గేటు కొట్టుకుపోయింది. ఆ సమయంలో భారీగా కృష్ణమ్మ నీరు వృథాగా సముద్రం పాలు కావడంతో రైతాంగం తీవ్ర ఆందోళన చెందింది.
అప్పట్లో నీటి వృథాను అడ్డుకునేందుకు నిపుణుల కమిటీ సూచనలతో తాత్కాలికంగా ‘స్టాప్లాక్ గేటు’ను అమర్చి ప్రమాదాన్ని నివారించారు. అయితే భవిష్యత్తులో ఇలాంటి ముప్పు రాకూడదనే ఉద్దేశంతో ఇప్పుడు అన్ని క్రస్ట్ గేట్లను పూర్తిగా మార్చేసి శాశ్వత పరిష్కారం చూపించారు. కొత్త గేట్ల అమరికతో తుంగభద్ర ప్రాజెక్టుకు తిరిగి పూర్వ వైభవం వచ్చింది. ముగ్గురు ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రి కలిసి ఈ గేట్లను ప్రారంభించనుండటంతో ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలోని కర్ణాటకతో పాటు రాయలసీమ, తెలంగాణ జిల్లాల రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి నిల్వ సామర్థ్యంతో నీటిని నిలబెట్టుకునేందుకు డ్యామ్ ఇప్పుడు సర్వసన్నద్ధంగా మారింది.