తెలంగాణలో రేపట్నుంచి జరగనున్న ఓటర్ల ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ లీడర్లు లైట్ తీసుకోవడంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎస్ఐఆర్ అనేది కేవలం సాంకేతిక ప్రక్రియ కాదని..
అది రాజకీయ, సామాజిక అంశమని ఆయన స్పష్టం చేశారు. ఇవాళ ఉదయం ఎస్ఐఆర్ ప్రక్రియపై నిర్వహించిన అత్యవసర వర్చువల్ సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ జాతీయ నాయకులు మీనాక్షి నటరాజన్, సచిన్ సావంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జ్ల తీరుపై ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. పార్టీ కోసం కష్టపడి పనిచేయని నాయకులు ఎంతటి వారైనా సరే తమకు అవసరం లేదని కుండబద్దలు కొట్టారు.సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల వారీగా కాంగ్రెస్ నేతల పనితీరుపై పైరయ్యారు. 'రాష్ట్రంలో ఎవరెవరు ఏం చేస్తున్నారో.. ఏయే నియోజకవర్గాల్లో ఎస్ఐఆర్ అవగాహన సదస్సులు ఎలా జరుగుతున్నాయో జిల్లాల వారీగా పక్కా సమాచారంతో కూడిన రిపోర్టు నా టేబుల్ మీద ఉంది. మేం పర్యవేక్షించడం లేదని ఎవరైనా అనుకుంటే పొరపాటే, ప్రతి ఒక్కరి యాక్టివిటీని మేం నోట్ చేసుకుంటున్నాం' అని హెచ్చరించారు. ఆదిలాబాద్ జిల్లాలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ 4 అవగాహన సమావేశాలు నిర్వహిస్తే, అధికారంలో ఉన్న కాంగ్రెస్ కేవలం 3 మీటింగులకే పరిమితమైందని ఆక్షేపించారు. కొత్తగూడెంలో బలహీనంగా ఉన్న బీజేపీ సైతం 8 సమావేశాలు పెట్టిందని గుర్తుచేశారు. ప్రజాస్వామ్యంలో ఓట్లను తొలగించే కుట్రలు చేసే పార్టీలే రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 160 సమావేశాలు పెట్టుకుని ముందుంటే.. అధికారంలో ఉండి కూడా కాంగ్రెస్ నేతలు వెనుకబడి ఉండటంపై ఆయన తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా మేల్కొని కాంగ్రెస్ తరఫున క్షేత్రస్థాయిలో మరిన్ని అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. ఎస్ఐఆర్ విషయంలో నాయకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సమాజంలోని అత్యంత పేద ప్రజలకు కోలుకోలేని భారీ అన్యాయం జరుగుతుందని ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని పేద వర్గాల ఓట్లు గనుక ఓటర్ల జాబితా నుంచి తొలగించబడితే.. భవిష్యత్తులో వారి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు కూడా రద్దయ్యే ప్రమాదం ఉందన్నారు. ఓటు హక్కు కోల్పోవడం వల్ల పేదలు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరం అవుతారని, కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లోనూ పేదలకు అన్యాయం జరగనివ్వవద్దని నేతలకు సూచించారు. గ్రామాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లు, స్థానిక ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ.. ప్రతి ఇంటా ఎస్ఐఆర్ పైన విస్తృత ప్రచారం కల్పించి, అర్హులైన వారందరి ఓట్లను భద్రపరచాలని స్పష్టం చేశారు.ఎస్ఐఆర్ సవరణల విషయంలో నియోజకవర్గ ఇంఛార్జి మంత్రులు, ఎమ్మెల్యేలు మరింత బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో వ్యవహరించాలని పార్టీ హైకమాండ్ తరఫున రేవంత్ రెడ్డి ఆదేశించారు. పార్టీ గైడ్లైన్స్ను ఎవరు కూడా ఉల్లంఘించడానికి వీల్లేదని తేల్చిచెప్పారు. 'పనిచేయకుండా నిర్లక్ష్యంగా ఉంటూ, పార్టీకి నష్టం కలిగిస్తామంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. అలాంటి వారిని అధిష్ఠానం అస్సలు క్షమించదు. నేతల పనితీరును పరిశీలించడానికి కేవలం 10 రోజుల సమయం మాత్రమే ఇస్తున్నాం. ఈ పది రోజుల్లోగా తమ శైలిని మార్చుకోని వారిని గుర్తించి, వారి స్థానంలో తక్షణమే మరొక సమర్థుడైన నాయకుడిని నియోజకవర్గ ఇంఛార్జ్గా నియమిస్తాం' అని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు.