మహారాష్ట్ర విధానసభలో మంగళవారం జరిగిన ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారంలో టీమిండియా యువ క్రికెటర్ తిలక్ వర్మ ప్రత్యక్షమై అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశారు.
ఎమ్మెల్సీగా ఎన్నికైన తన స్నేహితుడు విక్రమ్ కాకడే ప్రమాణ స్వీకారానికి తిలక్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అనంతరం తిలక్ వర్మ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘విక్రమ్, నేను చిన్ననాటి స్నేహితులం.. సోదరుడిలాంటి వాడు.. అతడికి ఎమ్మెల్యే పదవి దక్కడం చాలా సంతోషంగా ఉంది.. నిజంగా నేను ఎంతో గర్వపడుతున్నాను.. కొత్త ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నారు.. సామాజిక సేవలో భాగంగా గతంలో అనేక కార్యక్రమాలు చేపట్టిన విక్రమ్.. కొత్త బాధ్యతల్లో మరింత రాణిస్తారు’’ అని ఆశాభావం వ్యక్తం చేశాడు.అలాగే, తన కెరీర్ గురించి కూడా తిలక్ మాట్లాడారు.. ‘‘ప్రపంచ వరల్డ్ కప్ ఇంకా చాలా దూరంలో ఉంది. ప్రస్తుతానికైతే ఒకదాని తర్వాత ఒకటిగా జరిగే సిరీస్లపైనే మేము దృష్టి పెడుతున్నాం... ఏదేమైనా, మా కష్టపడే తత్వం మాత్రం ఇలాగే కొనసాగుతుంది’’ అని చెప్పారు.ఎవరీ విక్రమ్ కాకడే ?ఎన్సీపీకి చెందిన విక్రమ్ కాకడే పుణే స్థానం నుంచి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన తండ్రి సంజయ్ కాకడే మాజీ ఎంపీ. దివంగత అజిత్ పవార్కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. విక్రమ్ కూడా అజిత్ కుమారుడు పార్థ్ పవార్కు మంచి మిత్రుడు. షూటింగ్లో రాష్ట్ర ఛాంపియన్ అయిన విక్రమ్.. జాతీయ స్థాయి జట్టులో కూడా పాల్గొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, థాయిలాండ్లలో జరిగిన టోర్నమెంట్లలో కూడా పాల్గొన్నారు.ఎన్సీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన విక్రమ్ కాకడే.. అఫిడ్విట్లో అజిత్ పవార్ చిన్న కుమారుడు జయ పవార్తో ఆర్థిక లావాదేవీల గురించి పేర్కొన్నారు. ఆయనకు రూ. 10 కోట్లు అప్పుగా ఇచ్చినట్టు అందులో ఉండటంతో తీవ్రదుమారం రేగింది. ప్రతిపక్షాలు దీనిపై విమర్శలు గుప్పించాయి. రూ.10 కోట్లకు ఎమ్మెల్సీ సీటు కొనుగోలు చేశారని ఆరోపించాయి. అయితే, కేవలం ఓ ఆస్తి కొనుగోలు కోసమే తాను డబ్బు ఇచ్చినట్టు సమర్దించుకున్నారు. మహరాష్ట్ర విధాన పరిషత్ ఎన్నికల్లో మొత్తం 17 మంది ఎమ్మెల్సీలుగా గెలిచారు. ఏకగ్రీవంగా ఎన్నికైన ఆరుగురు మంగళవారం.. మిగిలిన 11 మంది బుధవారం ప్రమాణ స్వీకారం చేస్తారు. మండలి ఛైర్మన్ రామ్ షిండే వారితో ప్రమాణస్వీకారం చేయించారు.