
టీమిండియా స్టార్ బ్యాటర్, రన్ మెషిన్ విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్ పర్యటనకు బీసీసీఐ ఎంపిక చేసింది. అయితే ఈ ఎంపికపై ఒక కీలక షరతు విధించింది. ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్లో గాయపడిన కోహ్లీ..
ప్రస్తుతం కోలుకుంటున్న నేపథ్యంలో అతని ఎంపిక పూర్తిగా ఫిట్నెస్ సాధించడంపైనే ఆధారపడి ఉంటుందని బోర్డు స్పష్టం చేసింది. గత నెల అహ్మదాబాద్లో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ అరుదైన హ్యామ్స్ట్రింగ్ గాయానికి గురయ్యారు. ఈ గాయం కారణంగానే ఆయన ఇటీవల జరిగిన అఫ్గానిస్తాన్తో వన్డే సిరీస్కు దూరమవ్వాల్సి వచ్చింది. కాగా జూలై 14 నుంచి ఇంగ్లాండ్తో ప్రారంభం కానున్న వన్డే సిరీస్ నాటికి కోహ్లీ కోలుకుంటాడని సెలక్టర్లు భావిస్తున్నారు. ఇక సోమవారం విరాట్ కోహ్లీ బెంగళూరులో ల్యాండ్ అయిన విజువల్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఫిట్నెస్ క్లియరెన్స్ చర్చలు జోరందుకున్న నేపథ్యంలో ఆయన యూకే ఫ్లైట్ ఎక్కడానికి గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
2027 వన్డే వరల్డ్ కప్లో రోహిత్, కోహ్లీ ఉంటారా?
భారత క్రికెట్లో ప్రస్తుతం 2027 వన్డే వరల్డ్ కప్ గురించి జోరుగా చర్చ సాగుతోంది. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఈ మెగా టోర్నీలో ఆడతారా లేదా అనే సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ విషయంపై బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా స్పందించారు. సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఈ సీనియర్ ద్వయం భవిష్యత్తుపై ఎలాంటి స్పష్టత ఇవ్వనప్పటికీ, బోర్డు రూమ్లో జరిగే వ్యూహాత్మక చర్చలను తాము గోప్యంగా ఉంచుతామని సైకియా తెలిపారు. ‘‘మాకు చాలా పటిష్టమైన టీమ్, నిపుణులు ఉన్నారు. సెలక్టర్లు, క్రికెట్ కమిటీ, సపోర్ట్ స్టాఫ్, హెడ్ కోచ్, ఆటగాళ్లతో నిరంతరం చర్చలు జరుగుతూనే ఉంటాయి. దీనికోసం ప్రత్యేకంగా సమావేశాలు అవసరం లేదు, ఇదొక నిరంతర ప్రక్రియ. అయితే ఇవన్నీ బోర్డు రూమ్కు సంబంధించిన వ్యూహాత్మక విషయాలు కాబట్టి మీడియా ముందు లేదా పబ్లిక్గా మాట్లాడే అధికారం నాకు లేదు’’ అని దేవజిత్ తెలిపారు.
ప్రస్తుతానికి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ కూడా 2027 వరల్డ్ కప్ ఆడటానికి ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. అయితే ఇంగ్లాండ్ టూర్ నాటికి కోహ్లీ ఫిట్నెస్ సాధించి పాత ఫామ్ను అందుకోవడమే ఇప్పుడు టీమిండియా ముందున్న అతిపెద్ద టాస్క్.
Virat Kohli has arrived in Bengaluru for The COE Fitness Test.
— 𝙒𝙧𝙤𝙜𝙣🥂 (@wrognxvirat) June 22, 2026