
భారత దేశ రాజకీయాల్లో ఏం జరుగుతోంది..? ఈ మధ్యే జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత దేశ రాజకీయాల్లో పెనుమార్పులు కనిపిస్తున్నాయి.
అప్పటి వరకు ఒక పార్టీలో ఉన్న ఎంపీలు, రాష్ట్రంలో అధికారం మారగానే ఉన్నఫలంగా ప్లేటు ఫిరాయించి తాజా అధికార పార్టీకి మద్దతు ఇవ్వడం జరుగుతోంది. ఇప్పటికే పశ్చిమ బెంగాల్‌లో 20 మంది టీఎంసీ ఎంపీలు ఎన్డీయే కూటమికి మద్దతు ఇస్తున్నామంటూ బాహాటంగానే చెప్పగా... మహారాష్ట్రలోని ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన పార్టీలో కూడా చీలికలు ప్రారంభమయ్యాయి. నిన్న మొన్నటి వరకు ఉద్ధవ్ థాక్రేనే తమ నేత అని మాట్లాడిన ఎంపీలు పశ్చిమ బెంగాల్ ఎపిసోడ్‌తో యూటర్న్ తీసుకుని షిండే శివసేన వైపు మొగ్గు చూపుతున్నారు.పెద్ద కుట్రకు తెరలేపుతోన్న బీజేపీఇక మహారాష్ట్రలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఆ పార్టీ సెకండ్ ఇన్ చీఫ్ మాజీ మంత్రి ఆదిత్య థాక్రే స్పందించారు. బీజేపీ పెద్ద కుట్రకు తెరలేపుతోందన్న సమాచారం తన వద్ద ఉన్నట్లు ఆదిత్య థాక్రే వెల్లడించారు. ప్రతిపక్ష పార్టీల నుంచి ఎంపీలను లాక్కుని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చి వేసేందుకు ప్రణాళికలు రచిస్తోందని ధ్వజమెత్తారు. పార్లమెంటులో సరిపడా సంఖ్య బలం లేకపోవడంతో విపక్ష పార్టీల ఎంపీలను ప్రలోభాలకు గురిచేస్తూ, బెదిరిస్తూ వారి వైపు తిప్పుకుంటోందని విమర్శించారు.2024లో జరిగిన ఎన్నికల్లో దేశ ప్రజలు వారికి 240 సీట్లకు పరిమితం చేశారని గుర్తు చేసిన ఆదిత్య థాక్రే... ఇప్పుడు రాజ్యాంగాన్నే మార్చాలనే ప్రయత్నంలో ఉండగా అందుకు సరిపడా సంఖ్యా బలం కోసం పార్టీల్లో చిచ్చు పెడుతోందని బీజేపీ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహా వికాస్ అగాఢీ కూటమి వల్లే గెలిచిన ఈ రెబల్ ఎంపీలు... ఓటర్ల ఇచ్చిన తీర్పును అపహాస్యం చేస్తూ అధికార కూటమికి కొమ్ము కాసేందుకు సిద్ధపడ్డారని మండిపడ్డారు. ఎన్డీయే సిద్ధాంతాలు ప్రజలకు నచ్చకనే వారు మహా వికాస్ అగాఢీ కూటమికి చెందిన అభ్యర్థులను ఎన్నుకున్నారని ఆదిత్య థాక్రే గుర్తు చేశారు. బీజేపీ దేశంలో ఎలాంటి అల్లర్లు అయినా సృష్టిస్తుంది,తప్పుడు ప్రచారాలు చేస్తుంది,ఇంకేవేవో చేస్తుంది. కానీ ఒక్కటి మాత్రం నిజం.బీజేపీకి పరిపాలన చేయడం రాదు.ఇందుకు నిదర్శనం ముంబైలోని బీఎంసీ, పూనేలోని పీఎంసీలే అని థాక్రే విమర్శించారు.ఎన్డీయేకు మద్దతు తెలపని ఎంపీలపై ఈడీ, సీబీఐ, ఐటీ వంటి ఏజెన్సీలను ఉసిగొలిపి బెదిరించి తమవైపు తిప్పుకుంటున్నారని బీజేపీపై తీవ్ర స్థాయిలో ఆదిత్య థాక్రే మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు డబ్బులు లేవని చెబుతున్నారని, సంక్షేమ పథకాల అమలుకు నిధులు లేవని చెప్తున్నారని.. అయితే ఎంపీలను కొనుగోలు చేసేందుకు మాత్రం డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో చెప్పాలని ఆదిత్య డిమాండ్ చేశారు.ఉద్ధవ్ థాక్రేకు చెందిన శివసేన పార్టీ గత గురువారం ఢిల్లీలో నిర్వహించిన పార్లమెంటరీ పార్టీ సమావేశానికి కేవలం ముగ్గురు ఎంపీలు మాత్రమే హాజరవడంతో మిగతా ఆరు మంది ఎంపీలు ఎన్డీయేకు మద్దతు ఇస్తున్నట్లు తేటతెల్లమైంది.ఇదిలా ఉంటే పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎంపీలపై చర్యలు తీసుకునే ప్రక్రియ ప్రారంభమైందని శివసేన రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ స్పష్టం చేశారు.