
ఇంటర్నెట్ డెస్క్: రష్యాపై ఉక్రెయిన్ భీకర దాడులు (Ukraine attacks) కొనసాగిస్తోంది. మాస్కో (Moscow), దాని పరిసరాల ప్రాంతాలే లక్ష్యంగా ఆదివారం వందల డ్రోన్లతో విరుచుకుపడింది.
వాటిలో దాదాపు 60 డ్రోన్లను కూల్చేసినట్లు రష్యా ఎయిర్ డిఫెన్స్ అధికారులు వెల్లడించారు. దాడుల నేపథ్యంలో నగరంలోని నాలుగు విమానాశ్రయాలు మూతపడ్డాయి. క్రిమియాపై కూడా ఉక్రెయిన్ దాడులకు పాల్పడుతుండడంతో అదనపు భద్రతా చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
ముందుజాగ్రత్త చర్యగా క్రిమియాలో సోమవారం జరగాల్సిన అన్ని బహిరంగ కార్యక్రమాలను అధికారులు రద్దు చేశారు. సాధ్యమైనంత వరకు విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు.. ఇంధన సదుపాయాలు, చమురు శుద్ధి కేంద్రాలపై కీవ్ దాడులు చేయడంతో క్రిమియా ప్రాంతంలో ఇంధన సరఫరాకు తీవ్ర అంతరాయం నెలకొంది. దీంతో నగరవ్యాప్తంగా ఉన్న పెట్రోల్ స్టేషన్లలో ప్రజలకు, ప్రభుత్వేతర సంస్థలకు ఇంధన విక్రయాలను నిలిపివేశారు.
విరామం ఇవ్వకుండా ఉక్రెయిన్ ప్రతిరోజూ వందల డ్రోన్లతో విరుచుకుపడుతుండడంతో మాస్కో ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ క్రమంలోనే ఉక్రెయిన్లోని దక్షిణ ఒడెసా ప్రాంతంపై రష్యా చేసిన ప్రతిదాడుల్లో ఒకరు మరణించగా.. ముగ్గురు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. ఈ దాడుల్లో పలు వాహనాలు ధ్వంసమవ్వగా.. ఇంధన నిల్వ ట్యాంకులలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.