
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్లో సీనియర్ కంటెంట్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్లో పనిచేశాను.
2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.
NEET Re-Exam 2026 Bihar Gang: వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (NEET) పరీక్షను చుట్టుముట్టిన వివాదాలు, అక్రమాలు రీ-నీట్ (Re-NEET) లోనూ కొనసాగుతుండటం తీవ్ర కలకలం రేపుతోంది. దేశవ్యాప్తంగా కఠిన నిబంధనల నడుమ నిర్వహించిన రీ-నీట్ పరీక్షలోనూ సరికొత్త మోసాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. తాజాగా బిహార్లో భారీ నెట్వర్క్ కలిగిన ఒక 'సాల్వర్ గ్యాంగ్' (నకిలీ అభ్యర్థుల ముఠా) గుట్టును పోలీసులు రట్టు చేశారు.
నమ్మకమైన సమాచారం మేరకు లఖిసరాయ్ జిల్లాలోని మూడు ప్రధాన పరీక్ష కేంద్రాలపై పోలీసులు ఏకకాలంలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పరీక్షల్లో అవకతవకలకు పాల్పడుతున్నట్లు ఆధారాలు లభించడంతో.. ఏడుగురు నకిలీ అభ్యర్థులు సహా మొత్తం 24 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అసలైన అభ్యర్థులకు బదులుగా భారీ మొత్తానికి ఒప్పందం కుదుర్చుకుని, పరీక్షలు రాయడానికి వచ్చిన ఈ నకిలీ అభ్యర్థులను పోలీసులు పక్కా వ్యూహంతో పట్టుకున్నారు.
బయోమెట్రిక్ సిబ్బందితో కుమ్మక్కు ఈ వ్యవస్థీకృత మోసంలో పరీక్షా కేంద్రాల్లో భద్రతను పర్యవేక్షించాల్సిన బయోమెట్రిక్ సంస్థ సిబ్బంది పాత్ర ఉండటం గమనార్హం. బయోమెట్రిక్ సంస్థ సిబ్బందితో కుమ్మక్కైన 14 మంది వెరిఫికేషన్ ఉద్యోగులను కూడా పోలీసులు రంగంలోకి దిగి అరెస్టు చేశారు. అభ్యర్థుల వేలిముద్రలు, గుర్తింపు కార్డుల తనిఖీల్లో ఎలాంటి అవకతవకలు బయటపడకుండా ఈ వెరిఫికేషన్ సిబ్బంది ముఠా సభ్యులకు సహకరించినట్లు విచారణలో తేలింది. సాంకేతిక లోపాలను సాకుగా చూపి, నకిలీ అభ్యర్థులను పరీక్షా హాళ్లలోకి అనుమతించేలా వీరు లోపాయికారీ ఒప్పందాలు చేసుకున్నారు.
సీటు కోసం రూ.40 లక్షల వరకు వసూలు.. ఈ నకిలీ గ్యాంగ్ నీట్ పరీక్షలో అర్హత సాధించి, మెడికల్ సీటు సంపాదించి పెడతామంటూ ఒక్కో అభ్యర్థి నుంచి రూ. 30 లక్షల నుంచి రూ. 40 లక్షల వరకు వసూలు చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. నిరుపేద, మధ్యతరగతి విద్యార్థుల ప్రతిభను తుంగలో తొక్కుతూ.. కేవలం డబ్బు బలంతో సీట్లు కొల్లగొట్టేందుకు ఈ ముఠా భారీ స్కెచ్ వేసింది. నిందితుల నుంచి పెద్ద ఎత్తున నగదు, నకిలీ గుర్తింపు కార్డులు, మొబైల్ ఫోన్లు, కీలక పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇప్పటికే నీట్ పరీక్ష విధానంపై దేశవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొనగా.. ఇప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన రీ-నీట్లోనూ ఇలాంటి దారుణాలు బయటపడటం విద్యావ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతోంది. ఈ ముఠా వెనుక ఉన్న కీలక సూత్రధారులను పట్టుకునేందుకు పోలీసులు విచారణను మరింత వేగవంతం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.