
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నీట్ పరీక్షల వ్యవహారంలో మరో ఘటన వెలుగుచూసింది. హైదరాబాద్లో జరిగిన నీట్ రీ-ఎగ్జామ్లో మాల్ప్రాక్టీస్కు పాల్పడిన ఓ విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రాగన్నగూడలోని జడ్పీహెచ్ఎస్ పరీక్షా కేంద్రంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పక్కా ప్రణాళికతో అక్రమానికి యత్నించిన ఆ విద్యార్థి చివరికి ఇన్విజిలేటర్లకు అడ్డంగా దొరికిపోయాడు.వివరాల్లోకి వెళితే, నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటకు చెందిన ఓ విద్యార్థి నీట్ పరీక్షలో కాపీ కొట్టేందుకు హైటెక్ పద్ధతిని ఎంచుకున్నాడు. మధ్యాహ్నం 2 గంటలకు పరీక్ష ప్రారంభం కానుండగా, ఉదయం 7 గంటలకే పరీక్షా కేంద్రానికి చేరుకున్నాడు. ఎవరూ గమనించని సమయంలో పాఠశాల వాష్రూమ్ వెంటిలేటర్లో తన స్మార్ట్ఫోన్ను దాచిపెట్టాడు. అనంతరం, మధ్యాహ్నం అందరితో పాటు పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించాడు. లోపలికి వెళ్లాక వాష్రూమ్కు వెళ్లి, ఫోన్ను తీసుకుని జిప్ లాక్ కవర్లో పెట్టి టాయిలెట్ ఫ్లష్ ట్యాంకులో దాచాడు.సిబ్బంది రెండుసార్లు తనిఖీలు చేసినప్పటికీ ఈ విషయాన్ని గుర్తించలేకపోయారు. పరీక్ష మొదలైన కొంతసేపటికి విద్యార్థి కడుపునొప్పి వస్తోందంటూ ఇన్విజిలేటర్ అనుమతితో వాష్రూమ్కు వెళ్లాడు. అయితే, చాలాసేపటి వరకు తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన ఇన్విజిలేటర్లు వాష్రూమ్ వద్దకు వెళ్లి చూడగా, విద్యార్థి ఫోన్లో సమాధానాలు వెతుకుతూ కనిపించాడు. వెంటనే అతడిని పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. పాఠశాల యాజమాన్యం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, విద్యార్థిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి ఫోన్ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.