
ఏఎన్ఎం శిక్షణ పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వస్తున్న ఓ యువతిని పట్టపగలే దారుణంగా హత్య చేసిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఆదివారం చోటుచేసుకుంది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
పోలీసులు అందించిన ప్రాథమిక సమాచారం ప్రకారం, మృతురాలిని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, సఖినేటిపల్లి లంక గ్రామానికి చెందిన టీనా రోజాగా గుర్తించారు. ఆమె సుళ్లూరుపేటలో ఏఎన్ఎం శిక్షణ పూర్తి చేసుకుని ఇంటికి బయలుదేరారు. ఈ క్రమంలో నరసాపురం రైల్వే స్టేషన్లో దిగి, తన స్వగ్రామానికి వెళ్లేందుకు ఓ కారును అద్దెకు మాట్లాడుకున్నారు.ప్రయాణ మధ్యలో వాటర్ బాటిల్ కొనుగోలు చేసేందుకు ఓ దుకాణం వద్ద కారు ఆపారు. అదే సమయంలో మార్గాని రమేశ్ అనే వ్యక్తి కత్తితో ఆమెపై విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఇది గమనించిన కారు డ్రైవర్ సురేశ్, దుండగుడిని అడ్డుకునే ప్రయత్నంలో గాయపడ్డాడు. తీవ్ర గాయాలపాలైన టీనా రోజా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పరిశీలించారు. గాయపడిన డ్రైవర్ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దాడికి గల కారణాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.