.webp&w=3840&q=75)
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్తో కలిసి యోగా గురువు బాబా రామ్దేవ్ యోగాభ్యాసం నిర్వహించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ..ప్రశాంత వాతావరణంలో యోగా గురువు బాబా రామ్దేవ్తో కలిసి యోగాభ్యాసం చేయడం మరపురాని అనుభూతి అని అన్నారు.
యోగాకు ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకువచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని మోదీ ప్రపంచానికి భారతదేశ శక్తి, సంస్కృతిని చాటుతూ దేశాన్ని అగ్రస్థానంలో నిలబెడుతున్నారని పేర్కొన్నారు. ప్రధాని చొరవతోనే నేడు 190 దేశాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించబడుతోందన్నారు.
ప్రపంచానికి మార్గనిర్దేశం చేయగల సామర్థ్యం భారతదేశానికే ఉందని, భారత్ విశ్వగురువుగా నిలుస్తోందని చెప్పారు.శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించేది యోగానే అని పేర్కొన్నారు. యోగాను ప్రజలకు మరింత చేరువ చేసిన బాబా రామ్దేవ్ సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. సాంకేతికత, ఆధ్యాత్మికత కలయికతోనే భవిష్యత్ అభివృద్ధి సాధ్యమని అన్నారు. యోగా, ఆధ్యాత్మిక సాధన ద్వారా ఆరోగ్యవంతమైన, సుసంపన్నమైన, ఆనందమయ ఆంధ్రప్రదేశ్ను నిర్మించవచ్చన్నారు. ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్ సాధన కోసం అందరూ కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
యోగాంధ్ర–2025 కార్యక్రమాన్ని విశాఖపట్నంలో విజయవంతంగా నిర్వహించి పలు రికార్డులు సృష్టించామని గుర్తుచేశారు. ప్రధాని మోదీ సమక్షంలో గిన్నిస్ వరల్డ్ రికార్డులతో పాటు పలు ప్రపంచ రికార్డులు నమోదు చేశామని తెలిపారు. వచ్చే ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని తిరుపతిలో నిర్వహిస్తామని ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా 1.33 లక్షల కేంద్రాల్లో కోటి మందికి పైగా యోగా సాధన చేస్తున్నారని వెల్లడించారు. యోగాను ఇంటింటికీ చేర్చి ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
స్వర్ణ గ్రామాలు, వార్డు కార్యాలయాల్లో శాశ్వత యోగా మందిరాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. యోగా కార్యక్రమాల పర్యవేక్షణ కోసం జిల్లా, మండల స్థాయిలో ప్రత్యేక అధికారులను నియమిస్తామని చెప్పారు. ప్రమాణిత యోగా విధానాలను రూపొందించేందుకు నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. యోగాంధ్ర కోసం ప్రత్యేక పోర్టల్ను ప్రారంభిస్తామని తెలిపారు. జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్కు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నామని, రసాయన రహిత ఆహారాన్ని స్వీకరిస్తే అనారోగ్య సమస్యలు తగ్గుతాయని పేర్కొన్నారు.
రాష్ట్రంలో పచ్చదనాన్ని 50 శాతానికి పెంచే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. సంజీవని ప్రాజెక్టును ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని ప్రకటించారు. వైద్య నిపుణుల సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తామని, సంజీవని కార్యక్రమంలో యోగాను కూడా భాగస్వామ్యం చేస్తామని చెప్పారు. ప్రతిరోజూ గంటసేపు యోగా, ధ్యానం, ప్రాణాయామం చేస్తే ఆస్పత్రుల అవసరం చాలా వరకు తగ్గిపోతుందని అన్నారు.
సాయికృష్ణ కేసులో కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం
.