
చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి (Sudha Reddy) లాయర్ అయ్యారు. ఏపీ బార్ కౌన్సిల్ నుంచి ఆమె న్యాయవాదిగా నమోదు చేసుకుని, పట్టా అందుకున్నారు.
తాజాగా చంద్రగిరి మండలంలోని కెఎంఎం కళాశాల పరీక్షా కేంద్రంలో ఆమె 'ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్-21' పరీక్ష రాశారు. ఈ జాతీయ స్థాయి పరీక్షలో ఘన విజయం సాధించిన సుధారెడ్డి.. విజయవాడలో బార్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన అధికారిక సమావేశంలో న్యాయవాదిగా రిజిస్టర్ చేసుకున్నారు.
లాయర్ పట్టాపై పులివర్తి సుధారెడ్డి సంతోషాన్ని వ్యక్తం చేశారు. లాయర్ పులివర్తి సుధారెడ్డిగా చెప్పుకోవడం ఎంతో గర్వంగా ఉందన్నారు. పోటీ ప్రపంచంలో మహిళలుగా మనం అన్ని రంగాలలో ముందుకు దూసుకుపోవాలని, ఒక మహిళగా, భార్యగా, తల్లిగా, అత్తగా కుటుంబ బాధ్యతలు చక్కబెట్టడంతో పాటు, అటు పుట్టింటికి, ఇటు మెట్టినింటికి గౌరవాన్ని తెచ్చేలా మనల్ని మనం ఎప్పటికప్పుడు మలుచుకుంటూ ముందుకు సాగాలని సుధారెడ్డి పిలుపునిచ్చారు.
సమాజంలో ప్రశ్నించడానికి కేవలం గొంతు ఒక్కటే ఉంటే సరిపోదని, చట్టబద్ధమైన అధికారం (న్యాయ పరిజ్ఞానం) కూడా తోడైతేనే అన్యాయాన్ని నిలదీసి, సామాన్యులకు న్యాయం చేయగలుగుతామని సుధారెడ్డి తెలిపారు. అందుకే తాను ఎంతో పట్టుదలగా న్యాయ విద్యను అభ్యసించానని ఆమె తెలిపారు. ఎమ్మెల్యే సతీమణిగా ఎంతో బిజీగా ఉంటూనే లాయర్ పట్టా సాధించడం పట్ల చంద్రగిరి నియోజకవర్గ ప్రజలు, కుటుంబ సభ్యులు, టీడీపీ కార్యకర్తలు, నాయకులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. అలాగే వారు కూడా ఆమెకు శుభాకాంక్షలు చెప్తున్నారు.