EPF Interest Rate 2025-26 : ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేసే వారికి ఈపీఎఫ్ అకౌంట్ ఉంటుంది. దీనిని ఈపీఎఫ్ఓ నిర్వహిస్తుంటుంది. ఇక్కడ ప్రతి నెలా జీతం నుంచి పీఎఫ్ అకౌంట్లో 12 శాతం జమ చేయాల్సి ఉంటుంది.
ఇంకా అదే యాజమాన్యం కూడా 12 శాతం యాడ్ చేయాలి. కంపెనీ యాడ్ చేసే దాంట్లో ఈపీఎఫ్ అకౌంట్లోకి 3 శాతానికిపైగా వెళ్తే.. మరో 8 శాతానికిపైగా ఈపీఎస్ అకౌంట్లో చేరుతుంది. ఇక పీఎఫ్ అకౌంట్లో జమయ్యే డబ్బులపై కేంద్ర ప్రభుత్వం వడ్డీ చెల్లిస్తుంటుంది. ఈ వడ్డీ రేట్లను ఏటా సవరిస్తుంటుంది కేంద్రం. ఇక్కడ వడ్డీ రేటు తగ్గించొచ్చు లేదా పెంచొచ్చు లేదా స్థిరంగా కూడా ఉంచొచ్చు. ప్రతి ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత వడ్డీ ఖరారు చేసి ఆ డబ్బుల్ని పీఎఫ్ ఖాతాలో జమ చేస్తుంటుంది. ఇప్పుడు 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పీఎఫ్ వడ్డీ రేటుపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) ప్రతిపాదించిన 8.25 శాతం వడ్డీ రేటుకు కేంద్రం నుంచి తాజాగా గ్రీన్ సిగ్నల్ లభించింది. లక్షలాది మంది పీఎఫ్ వడ్డీ తమ అకౌంట్లో ఎప్పుడు జమవుతుంది అని ఎదురుచూస్తుండగా కీలక ప్రకటన వచ్చింది. ఇక సుమారు 7 కోట్ల మందికిపైగా పీఎఫ్ చందాదారులకు ఈ వడ్డీ డబ్బులు దాదాపుగా ఈ నెలలోనే క్రెడిట్ కానున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. వడ్డీ పడిందో లేదో అనేది కచ్చితంగా చెక్ చేసుకోవడం మంచిది. ఇందుకోసం పీఎఫ్ వెబ్సైట్ లేదా ఉమంగ్ యాప్, మిస్డ్ కాల్, SMS సర్వీస్ వంటివి అందుబాటులో ఉన్నాయి. 2026, మార్చి 2న కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ నేతృత్వంలో సమావేశమైన సీబీటీ.. ఈపీఎఫ్ వడ్డీ రేటును 8.25 శాతంగా నిర్ణయించింది. ఈ ప్రతిపాదనను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపించింది. తాజాగా అవే సిఫార్సుల్ని యథాతథంగా ఉంచుతున్నట్లు తెలిపింది. దీంతో వడ్డీ రేటు వరుసగా మూడో ఆర్థిక సంవత్సరంలో 8.25 శాతంగానే ఉంది. 2023-24, 2024-25 ఆర్థిక సంవత్సరంలో కూడా కేంద్రం ఇదే వడ్డీ రేటు అందించింది. సీబీటీ సిఫార్సు చేసిన కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫై చేయాల్సి ఉంటుంది. కిందటేడాది చూస్తే మే 24నే ఆర్థిక శాఖ దీనిని నోటిఫై చేయగా ఈసారి మాత్రం దాదాపు నెల ఆలస్యమైంది. కానీ కాస్త ముందుగానే చందాదారుల అకౌంట్లో వడ్డీ జమ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే ఈ నెలలోపే వడ్డీ యాడ్ కానుందని చెప్పొచ్చు. అయితే ఆర్థిక సంవత్సరం ముగిసి దాదాపు 3 నెలలు కావొస్తున్న తరుణంలో ఆలస్యంగా వడ్డీ జమ చేస్తే ఏమైనా ప్రయోజనాలు కోల్పోతామా అన్న సందేహాలు ప్రతి ఒక్కరిలో వస్తుంటాయి. కానీ ఇక్కడేం భయాలు అక్కర్లేదని.. ఎప్పుడు వడ్డీ చేసినా పూర్తి మొత్తం పడుతుందని, ఎలాంటి నష్టం ఉండదని చెబుతూ వస్తోంది.