ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి వెళ్లేవారి కష్టాలు తొలగిపోనున్నాయి. మంగళగిరి నుంచి రాజధాని ప్రాంతానికి వెళ్లే మార్గంలో ఇబ్బందిగా మారిన నిడమర్రు రైల్వే లెవెల్ క్రాసింగ్ సమస్యకు పరిష్కారం లభించింది. నిడమర్రు రైల్వే లెవల్ క్రాసింగ్ దగ్గర రైల్వే ఓవర్ బ్రిడ్జికి గ్రీన్సిగ్నల్ రాగా..
ఇవాళ కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారా లోకేష్లు శంకుస్థాపన చేశారు. రూ.142 కోట్లతో ఈ ఆర్వోబీని నిర్మించనున్నారు. మంత్రి నారా లోకేష్ చొరవతో ఎన్నో ఏళ్ల సమస్యకు పరిష్కారం లభించింది. గుంటూరు జిల్లా నిడమర్రు రైల్వే లెవల్ క్రాసింగ్ వల్ల మంగళగిరి నుంచి అమరావతి, తాడికొండ వైపు రాకపోకలు కొనసాగించేవారికి ఇబ్బందులు ఎదురయ్యాయి.
వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ సమస్యలు ఎదురయ్యేవి. అక్కడ తరచూ గేటు మూయడంతో వాహనదారులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రద్దీ సమయంలో వాహన రాకపోకలు ఆగిపోవడంతో పాటుగా ప్రయాణ సమయం పెరగడం, అత్యవసర సేవలకు అంతరాయం ఎదురైంది.
అలాగే మంగళగిరి దగ్గర ఉన్న క్రికెట్ స్టేడియానికి వెళ్లవారికి ఇబ్బందులు తప్పలేదు. ఈ విషయం మంత్రి లోకేష్కు తెలియడంతో ఆయన చొరవ తీసుకుని ఆర్వోబీ కోసం రైల్వే అధికారులకు రిక్వెస్ట్ చేయడంతో మంజూరు చేశారు. ఈ ఆర్వోబీ పూర్తయితే అమరావతి, తాడికొండ, మంగళగిరి, నిడమర్రు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు తొలగిపోతాయి.
మంగళగిరి నుంచి నిడమర్రు, బేతపూడి, నీరుకొండ, కురగల్లు గ్రామాల ప్రజలకు ప్రమాయణ సమయం తగ్గుతుందని చెబుతున్నారు. నిడమర్రు ఆర్వోబీ 10 మీటర్ల ఎత్తు, 767.50 మీటర్లు పొడవు, 28 మీటర్ల వెడల్పుతో నాలుగు లైన్లుగా నిర్మించనున్నారు. రైల్వే లైన్ నుంచి మంగళగిరి వైపు 405.50 మీటర్లు, అమరాతి వైపు 362 మీటర్లు నిర్మాణం చేపట్టనున్నారు.
ఆర్వోబీ నాలుగులైన్లుగా.. ప్రతి లైను 3.75 మీటర్లు.. గ్యారేజ్ వెడల్పు 15 మీటర్లు ఉంటుంది. 0.45 మీటర్లు చొప్పున రెండు వైపులా క్రాస్ బ్యారియర్లు, 0.45 మీటర్లు మధ్య డివైడర్ నిర్మించనున్నారు. సర్వీసు రోడ్డు డ్రైన్లతో కలిపి
రెండు వైపులా 11 మీటర్లు(5.5×2) 5.5 మీటర్ల వెడల్పు ఉంటుంది. రోడ్లతో కలిపి మొత్తం వంతెన వెడల్పు 28 మీటర్లు ఉంటుంది. నిడమర్రు ఆర్వోబీకి శంకుస్థాపన చేయడంతో త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు.