
ఫ్రాన్స్ లోని ఎవియాన్ వేదికగా జరుగుతున్న అంతర్జాతీయ 52వ జీ7 శిఖరాగ్ర సదస్సులో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, భారత ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సమావేశంలో భాగంగా జీ7 ప్రపంచ నేతలు గ్రూప్ ఫోటో దిగుతున్న తరుణంలో మోదీ- మెలోనీ మధ్య సరదా సంభాషణ జరిగింది.
ఈ మేరకు వీరిద్దరూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. మిమ్మల్ని మళ్లీ కలవడం ఆనందంగా ఉందని మెలోనీ చెప్పగా.. దానికి మోదీ ఎదో అన్నారు. అందుకు మెలోనీ ఇన్ స్టా గ్రామ్ లో మనం ఫేమస్ కపుల్ అనేశారు. దాంతో ఇద్దరూ నవ్వుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
అయితే తాజాగా అమెరికా- ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. పశ్చిమాసియాలో దాదాపు 100 రోజులకు పైగా ఇరాన్- అమెరికా ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ దేశాలు తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిన విషయం తెలిసిందే. పేద, మధ్య తరగతి, అభివృద్ది చెందిన ఇలా దాదాన్ని అన్ని దేశాలపై ఇరాన్- అమెరికా యుద్ధం ప్రభావం పడింది.
అయితే అమెరికా- ఇరాన్ మధ్య సంధిని నెలకొల్పడంలో పాకిస్థాన్, ఖతార్ ముఖ్య పాత్ర పోషించాయి. ఈ మేరకు పాకిస్థాన్, ఖతార్ దేశాలకు ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ కృతజ్ఞతలు తెలిపారు. అమెరికా- ఇరాన్ మధ్య శాంతిని నెలకొల్పడం ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా ముఖ్యం అని పేర్కొన్నారు.
ఈ మేరకు ఇరు దేశాల మధ్య సంధిని కుదర్చడంలో కీలక పాత్ర పోషించిన పాకిస్థాన్, ఖతార్ కు థ్యాంక్స్ చెబుతూ మెలోనీ ట్వీట్ పెట్టారు. ప్రస్తుతం ఆ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. "ఫ్రాన్, జర్మనీ, యూకే దేశాలతో పాటుగా ఇటలీ కూడా అమెరికా- ఇరాన్ మధ్య జరిగిన అవగాహన ఒప్పందాన్ని స్వాగతిస్తుంది.
ఈ అవగాహన ఒప్పందంలో కీలక పాత్ర పోషించిన ఖతార్, పాకిస్థాన్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ వల్లే ఈ ఒప్పందం
సాధ్యమైంది. శాంతిని నెలకొల్పేందుకు ఇదే మంచి అవకాశం. ఇక ఇరు దేశాల మధ్య దౌత్య పరమైన కార్యకలాపాలకు ఇటలీ సాయం చేస్తుంది.
ఈ ఒప్పందంలోని రూల్స్ క్లియర్ గా ఉన్నాయి. ఇరాన్ అణ్వాయుధాలను సమకూర్చుకోవద్దు. అలాగే హార్మూజ్ జలసంధిలో స్వేచ్ఛా వాణిజ్య విధానం గ్యారంటీగా అమల్లోకి రావాలి. ఈ మేరకు అంతర్జాతీయ సంస్థలు, దేశాలతో కలిసి హార్మూజ్ జలసంధిని తిరిగి ఓపెన్ చేయడంలో సహకరిస్తాం. అలాగే లెబనాన్ లోనూ ఉద్రిక్తతలు సద్దుమణగాలి. ఈ మేరకు ఇటలీ ప్రభుత్వం లెబనాన్ కు సహకారం అందిస్తుంది" అని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ట్వీట్ చేశారు. మెలోనీ.. పాకిస్థాన్ కు థ్యాంక్స్ చెప్పడంపై సామాజిక మాధ్యమాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.