
YS Jagan: తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ సీనియర్ నేతలు, ముఖ్య నాయకులతో కీలక సమావేశం నిర్వహించారు. ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియపై ప్రత్యేకంగా చర్చించిన జగన్, రాబోయే నాలుగు వారాలు అత్యంత కీలకమని పేర్కొంటూ పార్టీ శ్రేణులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఈ సందర్భంగా నియోజకవర్గ కో-ఆర్డినేటర్లు, బూత్ స్థాయి నాయకులు నిర్లక్ష్యం చేయకుండా ప్రతిరోజూ పరిస్థితులను సమీక్షించాలని ఆదేశించారు. ఓట్ల తొలగింపుకు సంబంధించిన ఫిర్యాదులు వస్తే వెంటనే ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని, సమస్య పరిష్కారం కాకపోతే పార్టీ కేంద్ర కార్యాలయానికి సమాచారం అందించాలని సూచించారు.
ఒక్కసారి ఓటు తొలగించబడితే తిరిగి జాబితాలో చేర్పించడం కష్టమవుతుందని పేర్కొన్న జగన్, ప్రతి ఓటును కాపాడుకోవడం పార్టీ శ్రేణుల బాధ్యత అని అన్నారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి అలసత్వానికి తావివ్వకుండా నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు.
వైసీపీకి అనుకూలంగా ఉన్న ఓట్లను తొలగించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని జగన్ ఆరోపించారు. అధికార దుర్వినియోగంతో ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు.
ప్రతి బూత్లో కనీసం 50 ఓట్లు తొలగించడమే కూటమి లక్ష్యంగా పనిచేస్తోందని ఆరోపించిన జగన్, వివిధ గిమ్మిక్కుల ద్వారా ఓట్ల తొలగింపునకు చేసే ప్రయత్నాలను అడ్డుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బూత్ లెవల్ ఏజెంట్లు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా పనిచేయాలని, ఎస్ఐఆర్ ప్రక్రియపై రోజువారీ పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు.
రాబోయే రోజుల్లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ప్రతి ఓటును రక్షించేందుకు పార్టీ యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్
..