
Thalliki Vandanam Scheme: తల్లికి వందనంపై శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయనున్న ‘తల్లికి వందనం’ పథకం కింద ఆర్థిక సాయాన్ని జులై మూడో వారంలో అందించేలా అన్ని చర్యలు చేపట్టాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు.
ఈ పథకానికి సంబంధించిన తల్లుల ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియ త్వరలోనే పూర్తవుతుందని అధికారులు వెల్లడించారు. ఉండవల్లిలోని తన నివాసంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లికి వందనం, బడి పిలుస్తోంది, షైనింగ్ స్టార్స్, మెగా పీటీఎం, యోగాంధ్ర, టెట్ నిర్వహణ తదితర అంశాలపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరాలు సమర్పించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికల పరిస్థితిపై మంత్రి లోకేష్ ప్రత్యేకంగా ఆరా తీశారు. విద్యార్థుల ప్రవేశాల సంఖ్యను పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. తల్లికి వందనం పథకానికి సంబంధించిన అన్ని ప్రక్రియలను వేగవంతం చేసి అర్హులైన లబ్ధిదారులకు సకాలంలో ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
సమీక్షలో భాగంగా జూన్ 29న ‘షైనింగ్ స్టార్స్’ కార్యక్రమం నిర్వహించాలని, జులై మూడో వారంలో రాష్ట్రవ్యాప్తంగా ‘మెగా పీటీఎం’ నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నారు. విద్యా రంగంలో నాణ్యత పెంపుతో పాటు విద్యార్థుల హాజరు, విద్యా ప్రమాణాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి లోకేష్ అధికారులకు సూచించారు.
‘తల్లికి వందనం’ పథకం అమలు ద్వారా విద్యార్థుల తల్లులకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు విద్యాభ్యాసాన్ని మరింత ప్రోత్సహించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని సమావేశంలో పేర్కొన్నారు మంత్రి నారా లోకేష్
..