
Annadatha Sukhibhava : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అన్నదాత సుఖీభవ పథకం నిధుల విడుదలపై కీలక అప్డేట్ ఇచ్చింది. ప్రతీయేటా రైతులకు పెట్టుబడి సాయంగా కూటమి ప్రభుత్వం మూడు విడుతల్లో ‘అన్నదాత సుఖీభవ’ పథకం నిధులను రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తున్న విషయం తెలిసిందే.
అయితే, తదుపరి నిధుల విడుదలపై ప్రభుత్వం కీలక విషయాన్ని చెప్పింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో రైతులు ఖరీఫ్ సాగు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో సాగు ఖర్చులకు ఉపయోగపడేలా ప్రభుత్వం సాయం అందించేందుకు చర్యలు చేపట్టింది.
దీంతో జూన్ నెలాఖరులో లేదంటే జులై మొదటి వారంలో అన్నదాత సుఖీభవ డబ్బులు అర్హులైన రైతుల ఖాతాల్లో జమయ్యే అవకాశం ఉంది. అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు ఏడాదికి మొత్తం రూ.20 వేల ఆర్థిక సాయం అందుతోంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం ద్వారా రూ.6వేలు, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రూ.14 వేలు అందజేస్తున్నారు.
ఈ మొత్తాన్ని మూడు విడతలుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఇప్పటికే మార్చి నెలలో తొలి విడతగా రూ.7వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ కాగా, ఇప్పుడు రెండో విడత నిధుల విడుదలకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. గత విడతలో సాంకేతిక కారణాలు, డాక్యుమెంట్లలో పొరపాట్ల వల్ల లబ్ధి పొందని రైతులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పిస్తోంది.
రైతు సేవా కేంద్రాల ద్వారా వివరాల్లోని తప్పులను సరిదిద్దుకోవడంతో పాటు కొత్త దరఖాస్తులు కూడా స్వీకరిస్తున్నారు. ఇవి గుర్తుంచుకోండి.. ♦ అన్నదాత సుఖీభవ నిధులు బ్యాంక్ ఖాతాల్లో జమ కావాలంటే రైతులు కొన్ని నిబంధనలు తప్పనిసరిగా పూర్తి చేయాలి.
♦ బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ కాని రైతులు 1బీ, ఆధార్ కార్డు, ఫోన్ నంబరుతో స్థానిక సచివాలయంలో దరఖాస్తు చేయాలి. ♦ వీఆర్వో, తహసీల్దార్ నిర్దారించాక అనుసంధాన
ప్రక్రియ పూర్తవుతుంది. ఆ తరువాత ఆటోమేటిక్ గా ఆ రైతు అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులవుతారు. ♦ గతేడాది అన్నదాత సుఖీభవ డబ్బులు అందుకున్న రైతులు ఈ ఏడాది ఆధార్ సీడింగ్ చేయాల్సిన పనిలేదు. ♦ ఆదాయపు పన్ను ఇంతకుముందు చెల్లించి ప్రస్తుతం చెల్లించనివారు, ఈకేవైసీ సమస్యలు, ఇతర ఏదైనా కారణాలతో పథకం లబ్ధి పొందనివారు పూర్తి వివరాలు, ధ్రువపత్రాలు తీసుకొని వెళ్లి రైతు సేవా కేంద్రంలో సంప్రదించాల్సి ఉంటుంది.