
హైదరాబాద్ నగరంలోని మణికొండ శివాజీ నగర్ ప్రాంతంలో అమావాస్య సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజలు వివాదానికి దారితీశాయి. ఓ కుటుంబం తమ ఇంటి ముందు కుంకుమ, పసుపు, నిమ్మకాయలు తదితర పూజా సామగ్రిని ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
ఈ పూజలు సాధారణ పూజలా..? లేక క్షుద్ర పూజలా అనే అనుమానాలు వ్యక్తం చేస్తూ కొందరు స్థానికులు అభ్యంతరం తెలిపారు. ఇలాంటి చర్యల వల్ల కాలనీలో భయాందోళనలు నెలకొంటున్నాయని, చిన్నపిల్లలు, మహిళలు ఆందోళనకు గురవుతున్నారని మండిపడ్డారు. ఈ విషయమై స్థానికులు సంబంధిత కుటుంబ సభ్యులను ప్రశ్నించారు..
ఈ సమయంలో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. రెండు వర్గాలు ఒకరిపై మరొకరు ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో ఓ మహిళ ఎదురింటి వారి కళ్లలో కారం చెల్లి దాడి చేసినట్టు పేర్కొంటున్నారు. గొడవ మరింత ముదరడంతో.. స్థానికులు వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించారు.
ఘర్షణ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను శాంతింపజేశారు. కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొన్నప్పటికీ పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. అనంతరం ఇరువర్గాల ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అమావాస్య సందర్భంగా నిర్వహించిన పూజల కారణంగా వివాదం ఎలా మొదలైంది.. ఘర్షణకు దారితీసిన పరిస్థితులు ఏమిటి, కారం చల్లిన ఘటనలో వాస్తవాలు ఏంటన్న కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అమావాస్య పూజలు బస్తీలో ఉద్రిక్తతలకు దారితీయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
అయితే.. ప్రజలు అపోహలకు లోనుకాకుండా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకుండా సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. మొత్తానికి అమావాస్య.. బస్తీలో అగ్గిరాజేయడం సంచలనంగా మారింది. మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
..