తమిళనాడు ప్రతిపక్ష పార్టీ అన్నాడీఎంకే నుంచి తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలు అధికార పార్టీ తమిళగ వెట్రికళగం (టీవీకే)లో చేరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ తిరుగుబాటు ఎమ్మెల్యేల వ్యవహారం కోర్టుకు చేరింది. రాజీనామా చేసిన నలుగురు ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ ఆమోదించడాన్ని సవాల్ చేస్తూ ఏఐడీఎంకే మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది.
ఏఐడీఎంకే ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలను స్పీకర్ ఖాళీగా ప్రకటించారు. దాంతో ఆ నాలుగు నియోజకవర్గాలను ఖాళీగా ప్రకటిస్తూ స్పీకర్ జారీ చేసిన నోటిఫికేషన్ రద్దు చేయాలంటూ పార్టీ విప్ అగ్రి కృష్ణమూర్తి పేరిట పిటిషన్ దాఖలైంది.
ఈ వివాదం తేలే వరకూ ఆ నాలుగు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహించకండా ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టును అభ్యర్థించారు. ఏఐడీఎంకే దాఖలు చేసిన పిటిషన్పై మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్.వైద్యనాథన్ ధర్మాధికారి, న్యాయమూర్తి జి.
అరుల్ మురుగన్ల ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ కేసును జూన్ 17న విచారించాలని కోర్టు నిర్ణయించింది. తమిళనాడు అసెంబ్లీలో మే 13న అధికార పార్టీ టీవీకే ప్రభుత్వం విశ్వాస పరీక్షతో ఈ వివాదం మొదలైంది. మాజీ మంత్రి సీవీ షణ్ముగం నేతృత్వంలోని ఏఐఏడీఎంకేకు చెందిన 25 మంది ఎమ్మెల్యేలు పార్టీ విప్ను ధిక్కరించి విజయ్ పార్టీకి అనుకూలంగా ఓటు వేశారు.
టీవీకేతో పొత్తు పెట్టుకోవాలని పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె.పళనస్వామిని ఒప్పించే ప్రయత్నం విఫలమైన తర్వాత ఈ తిరుగుబాటు మొదలైంది. అసెంబ్లీలో టీవీకే పార్టీకి అనుకూలంగా ఓటు వేయడంతో ఏఐఏడీఎంకే విప్ అగ్రి కృష్ణమూర్తి తిరుగులబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరారు.
అనర్హత పిటిషన్పై స్పీకర్ నిర్ణయం తీసుకునేలోపే నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి విజయ్ పార్టీలో చేరారు. స్పీకర్ కూడా వారి రాజీనామాలు వెంటనే ఆమోదించడం వివాదంగా మారింది. అనర్హత పిటిషన్లు పెండింగ్లో ఉన్న సమయంలో రాజీనామాలు ఆమోదించడం సరైన విధానం కాదని, ముందు అనర్హత వేటు వేశాకే రాజీనామాలపై
నిర్ణయం తీసుకోవాలని కోరింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ విజయ్ నారాయణ్ వాదనలు వినిపిస్తూ రాజీనామాలు ఆమోదించాలా? వద్దా? అన్నది పూర్తిగా స్పీకర్ పరిధిలోని అంశమని కోర్టుకు తెలియజేశారు.