
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ సోమవారం ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకాన్ని (నేషనల్ వార్ మెమోరియల్) సందర్శించారు. దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన వీర సైనికులకు ఆయన ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా అమర్ స్తంభం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి ఆయన శ్రద్ధాంజలి ఘటించారు.
అనంతరం త్యాగ్ చక్ర వద్దకు చేరుకుని, అమరవీరుల పేర్లు చెక్కిన గ్రానైట్ ఫలకాల వద్ద పుష్పాలను ఉంచి నివాళులర్పించారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన శౌర్యచక్ర గ్రహీత రాజ్ కుమార్, హవల్దార్ అరుణ్ కుమార్ వంటి వీరుల త్యాగాలను ఆయన ప్రత్యేకంగా స్మరించుకున్నారు.
సందర్శన అనంతరం అక్కడి డిజిటల్ విజిటర్స్ బుక్లో తన సందేశాన్ని నమోదు చేశారు.పవన్ కల్యాణ్ పర్యటన సందర్భంగా కల్నల్ ఆర్.కె. ఆనంద్, కెప్టెన్ రోహిత్ గార్గ్ వంటి సైనిక అధికారులు ఆయనకు యుద్ధ స్మారక ప్రాముఖ్యతను, అక్కడి నాలుగు చక్రాల వెనుక ఉన్న వీరగాథలను వివరించారు.
సాయుధ బలగాల త్యాగాల గురించి తెలుసుకోవడం, వారికి నివాళులర్పించడం తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా తెలిపారు
.