
IND W vs PAK W: భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య జరిగే పోరు అంటేనే అభిమానుల్లో ఎక్కడ లేని ఉత్కంఠ నెలకొంటుంది. ఇక నేడు (జూన్ 14) ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్లో భాగంగా ఇరు జట్ల మధ్య జరగబోయే హై-వోల్టేజ్ మ్యాచ్కు సర్వం సిద్ధమైంది. అయితే, ఈ మ్యాచ్కు ముందే ఒక ఆసక్తికరమైన అంశం తెరపైకి వచ్చింది. మ్యాచ్ ముగిసిన తర్వాత పాకిస్థాన్ ఆటగాళ్లతో భారత క్రీడాకారిణులు కరచాలనం (Handshake) చేస్తారా లేదా అనే చర్చ నడుస్తోంది. 2025లో జరిగిన పురుషుల ఆసియా కప్ నుంచి భారత క్రికెట్ జట్లు పాకిస్థాన్తో ‘నో హ్యాండ్షేక్’ (No handshake) విధానాన్ని పాటిస్తున్నాయి. ఆ తర్వాత జరిగిన రైజింగ్ స్టార్స్ ఆసియా కప్, అండర్-19 ఆసియా కప్, అలాగే అండర్-19 ప్రపంచకప్లలోనూ భారత జట్లు ఇదే ధోరణిని కొనసాగించాయి. గతేడాది జరిగిన మహిళల ప్రపంచకప్లోనూ భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్, పాక్ కెప్టెన్ ఫాతిమా సనాతో కరచాలనం చేయలేదు. నేడు కీలక పోరుకు ముందు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో హర్మన్ప్రీత్కు ఇదే ప్రశ్న ఎదురైంది. అయితే, ఈ వివాదంలోకి వెళ్లకుండా ఆమె చాలా చాకచక్యంగా సమాధానం ఇచ్చింది. తాము కేవలం ఆటపైనే దృష్టి పెట్టామని స్పష్టం చేస్తూ.. “మేము ఇక్కడికి క్రికెట్ ఆడటానికి వచ్చాము. మా జట్టులో ఆట గురించి తప్ప మరే ఇతర విషయాల గురించి చర్చించము” అని తేల్చి చెప్పింది. పాకిస్థాన్తో మ్యాచ్ అంటే సహజంగానే ఉండే ఒత్తిడి గురించి సైతం హర్మన్ప్రీత్ మాట్లాడింది. “నేను ఒక సాధారణ అభిమానిగా క్రికెట్ చూడటం ప్రారంభించినప్పటి నుంచి ఈ ఒత్తిడిని గమనిస్తున్నాను. ఇప్పుడు స్వయంగా ఆడుతుండటంతో ఆ ఒత్తిడి మరింత ఎక్కువగా ఉంటుంది. కానీ, ఇలాంటి పెద్ద మ్యాచ్లను ఒత్తిడితో కాకుండా ఎంజాయ్ చేస్తూ ఆడాలని మేము జట్టులో ఒకరికొకరు చెప్పుకుంటాము. అన్నింటికంటే ముఖ్యంగా, ఇది మాకు మరో సాధారణ మ్యాచ్ మాత్రమే”
అని ఆమె పేర్కొంది. గత ఏడాది జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్లో చూపించిన సానుకూల దృక్పథాన్నే ఈ టోర్నీలోనూ కొనసాగిస్తూ, విజయంతో ప్రయాణాన్ని ప్రారంభించడమే తమ లక్ష్యమని వివరించింది.