
కేంద్ర ప్రభుత్వం డీజిల్ హోర్డింగ్ మరియు బ్లాక్ మార్కెటింగ్ను అరికట్టడానికి ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. రిటైల్ ఇంధన అవుట్లెట్లలో ఒక్క వినియోగదారుడికి లేదా ఒక వాహనానికి రోజుకు 200 లీటర్లకు మించి హై
స్పీడ్ డీజిల్ అందించకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధనలు తక్షణం అమలులోకి వచ్చాయి మరియు 90 రోజుల వరకు అమలులో ఉంటాయి. అవసరమైతే ఈ గడువును మళ్లీ పొడిగించే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. పెట్రోలియం మరియు నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ జూన్ 11,న ఈ నూతన ఉత్తర్వులను జారీ చేసింది. కొన్ని ప్రాంతాల్లో రిటైల్ పంపుల్లో పెట్రోల్ మరియు డీజిల్ అమ్మకాలు అసాధారణంగా పెరగడం గమనించి ఈ చర్య తీసుకోవాల్సి వచ్చింది. పారిశ్రామిక, సంస్థాగత మరియు వాణిజ్య వినియోగదారులు బల్క్ సప్లై చానళ్ల ద్వారా కాకుండా రిటైల్ పంపుల నుంచి తక్కువ ధరకు డీజిల్ను కొనుగోలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ విధంగా బల్క్ వినియోగదారులు రిటైల్ పంపులను ఆశ్రయించడం వల్ల సుమారు రూ.40 లీటర్ తక్కువ ధరకే వారికి డీజిల్ లభిస్తోంది. దీంతో సాధారణ వినియోగదారులకు ఇంధనం అందుబాటును ఇది తీవ్రంగా ప్రభావితం చేస్తోందని ప్రభుత్వం భావించింది. ఫలితంగా స్థానిక కొరతలు ఏర్పడి, అత్యవసర సేవలకు అంతరాయం కలిగించే అవకాశం ఉందని కేంద్రం ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకుంది. ఈ నేపథ్యంలో కొత్త ఆదేశాల ప్రకారం పారిశ్రామిక, వాణిజ్య మరియు సంస్థాగత వినియోగదారులు రిటైల్ అవుట్లెట్ల నుంచి కొనుగోలు చేయకూడదు. వారు కేవలం డెడికేటెడ్ బల్క్ సప్లై పాయింట్లను మాత్రమే వాడాల్సి ఉంటుంది. రిటైల్ అవుట్లెట్లు డీజిల్ను వాహన ట్యాంకు లేదా పీఈఎస్ఓ ఆమోదం పొందిన కంటైనర్లలో మాత్రమే అందించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. డీజిల్ పునః విక్రయం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ఇదిలా ఉండగా ఈ నిర్ణయంపై కాంగ్రెస్ నాయకుడు రందీప్ సూర్జేవాలా తీవ్రంగా మండిపడుతూ ట్వీట్ చేశారు. ఈ కొత్త నిబంధనలను ఆయన "డ్రాకోనియన్" అని విమర్శిస్తూ, రైతులు మరియు జనరేటర్ల కోసం కొనుగోలు చేసేవారిని ఇది దెబ్బతీస్తుందన్నారు. అయితే ప్రభుత్వం ఈ పరిమితి సాధారణ ప్రైవేట్ వాహనదారులను ప్రభావితం చేయదని, ప్రధానంగా బల్క్ కొనుగోలుదారులను లక్ష్యంగా చేసుకుని తెచ్చామని కౌంటర్ ఇచ్చింది. మధ్యప్రాచ్య సంఘర్షణల వల్ల ప్రపంచ ఇంధన సరఫరా గొలుసులో వచ్చిన అస్థిరతను దృష్టిలో ఉంచుకుని ఈ చర్య తీసుకున్నారు. రిటైల్ స్టేషన్లలో బల్క్ కొనుగోలు తగ్గితే సాధారణ వినియోగదారులకు స్థిరమైన సరఫరా అందుతుందని ప్రభుత్వం తెలిపింది. ఈ పరిమితి రోజువారీ అవసరాలకు సరిపోతుందని, రాష్ట్రాలు హోర్డింగ్పై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా కేంద్ర అధికారులు సూచించారు.