
భారత్- పాకిస్థాన్ మధ్య ప్రస్తుతం పచ్చిగడ్డి వేస్తే భగ్గుమంటోంది. గతేడాది పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్- భారత్ మధ్య సంబంధాలు మరింతగా క్షీణించాయి. గతేడాది ఏప్రిల్ 22న జమ్మూకాశ్మీర్ లో జరిగిన
పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దానికి ప్రతీకారంగా పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. వందలమంది ఉగ్రమూకల్ని హతమార్చింది. అంతేకాక పాకిస్థాన్ పై దౌత్య పరంగా, ఆర్థిక పరంగా అత్యంత కఠినమైన వ్యూహాత్మక నిర్ణయాలను తీసుకుంది. సింధూ నది జలాల పంపిణీని నిలిపివేసింది.
అయితే భారత్ తీరుపై పాకిస్థాన్ రకరకాలుగా కుట్రలు పన్నుతోంది. ఇటీవలికాలంలో ఏకంగా ఆరు శాటిలైట్స్ ను ప్రయోగించి అంతరిక్షకేంద్రం నుంచి భారత్ సరిహద్దులు, సైనికుల కదలికలను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది పాకిస్థాన్. ఈ మేరకు పాకిస్థాన్ అన్నివిధాలుగా చైనా సాయం చేస్తోంది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకోనుంది పాకిస్థాన్.. తన రక్షణ బడ్జెట్ ను అమాంతం పెంచనుంది. భారత్ తో ఢీ అంటే ఢీ అనేందుకు కాలు దువ్వుతోంది.
ఇవాళ పాకిస్థాన్ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. అయితే ఎన్నడూ లేని విధంగా ఈ సారి పాకిస్థాన్ రక్షణ రంగం బలోపేతం కోసం 3 వేల బిలియన్ డాలర్లకు పెంచే అవకాశం ఉన్నట్లు సమాచారం. అంటే ఏకంగా 3 లక్షల కోట్లను కేటాయించనున్నట్లు స్పష్టం అవుతోంది. గతేడాది 2,500 బిలియన్ డాలర్లను మాత్రమే రక్షణ రంగానికి పాకిస్థాన్ కేటాయించింది. కానీ ఈ సారి ఆ బడ్జెట్ ను మరింతగా పెంచేసింది. ఈ నేపథ్యంలో చైనా సాయంతో పాకిస్థాన్.. భారత్ పై యుద్ధానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రక్షణ రంగం బలోపేతం విషయంలో పూర్తిగా చైనా, టర్కీ దేశాలపై పాకిస్థాన్ ఆధారపడుతోంది. మున్ముందు చైనా నుంచి మరిన్ని అత్యాధునిక ఆయుధాలను కొనుగోలు చేసి భారత్ కు సవాళ్లు విసరాలని పాకిస్థాన్ చూస్తున్నట్లు స్పష్టం అవుతోంది.
మరోవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ దేశాలు తీవ్ర సంక్షోభంలో మునిగిపోయాయి. ఇరాన్ హార్మూజ్ జలసంధిని మూసివేసింది. దాంతో చమురు, గ్యాస్ సరఫరా నిలిచిపోయి అనేక దేశాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఇక అసలే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్న పాకిస్థాన్.. పెనంలోంచి పొయ్యిలో పడింది. ఓవైపు దేశంలో ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. నిరుద్యోగం ఆకాశాన్ని తాకుతోంది. కానీ పాకిస్థాన్ మాత్రం దేశ ప్రజల అవసరాలను తీర్చకుండా రక్షణ రంగంపైనే ఆసక్తి కనబరుస్తోంది.