ఇరాన్పై రాత్రికి రాత్రే బాంబుల వర్షం కురిపిస్తామని స్టేట్మెంట్ ఇచ్చిన గంటల్లోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్లేటు ఫిరాయించారు. అమెరికా - ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం ఈ వారంలోనే కుదిరే అవకాశం
ఉందని ప్రకటించారు. ఈ ఒప్పందం అమలులోకి వస్తే ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హోర్మూజ్ జలసంధి మళ్లీ తెరుచుకునే అవకాశం ఉందని తెలిపారు. ట్రంప్ శాంతి ఒప్పందం గురించి చెప్పగా.. ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఇరాన్ స్పష్టం చేసింది. అమెరికా అపాచీ హెలికాప్టర్ కూల్చివేత తర్వాత ఇరు దేశాల మధ్య యుద్ధమేఘాలు అలముకున్నాయి. ఇరాన్తో పాటు హోర్మూజ్ జలసంధిలోని పలు నౌకలపై అమెరికా మిస్సైల్ దాడులు చేసింది. గురువారం రాత్రి ఇరాన్పై భారీ దాడులు చేస్తామని చెప్పిన ట్రంప్.. కొద్దిసేపటికే వైమానిక దాడులు రద్దు చేశామని ప్రకటించారు. ఇరాన్ అత్యున్నత నాయకత్వ స్థాయిలో చర్చలు జరిపి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అమెరికా, ఇజ్రాయిల్, సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, టర్కీ, పాకిస్థాన్, బహ్రెయిన్, కువైట్, జోర్డాన్, ఈజిప్ట్ దేశాలు ఈ ఒప్పందానికి మద్దతు ఇస్తున్నాయని ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఈ ఒప్పందం అధికారికంగా ఖరారయ్యే వరకూ హోర్మూజ్ జలసంధిపై ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. శాంతిరాగం ఆలపించే ముందు ఇరాన్ వైమానిక, నౌకాదళ, రాడర్ - రక్షణ సామర్థ్యాలు దాదాపు నిర్వీర్యం చేశామంటూ ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ ప్రధాన చమురు ఎగుమతి కేంద్రమైన ఖార్గ్ దీవితో పాటు మిగతా ఇంధన నిక్షేపాల ఎగుమతులపై నియంత్రణ సాధిస్తామని చెప్పారు. అదే సమయంలో ఇరాన్ దక్షిణ హోర్మూజ్గాన్ ప్రావిన్స్లోని సిరిక్ తీర ప్రాంతం వద్ద గురువారం పేలుడు సంభవించినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది. ఇరాన్తో యుద్ధ సమయంలో అమెరికా భారతీయ నౌకలను టార్గెట్ చేస్తూ వచ్చింది. ఇప్పటి వరకు మూడు నౌకలపై దాడి చేసింది. దీన్ని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా తీవ్రంగా ఖండించింది. మొత్తానికి ట్రంప్ శాంతి ఒప్పందం కుదురుతుందని ప్రకటించినప్పటికీ ఇరాన్ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.