హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీలో ఒక పబ్ వేదికగా సాగుతున్న అశ్లీల నృత్యాలు, వలపు వల దోపిడీ ముఠా ఆట కట్టించారు కూకట్పల్లి డీసీపీ రితిరాజ్. సినిమాలను తలపించేలా ఒక లేడీ ఐపీఎస్ అధికారి ఒంటరిగా.. మఫ్టీలో
చేసిన ఈ సాహసోపేత ఆపరేషన్ ఇప్పుడు నగరంలో హాట్ టాపిక్గా మారింది. స్థానిక పోలీసుల పర్యవేక్షణ లోపంతో యథేచ్ఛగా సాగుతున్న గలీజు దందాను ఆమె రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. కేపీహెచ్బీ పరిధిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్లో కస్టమర్లను ఆకర్షించడానికి వివిధ ప్రాంతాల నుంచి అందమైన యువతులను అక్రమంగా రవాణా చేసి తీసుకొస్తున్నట్లు డీసీపీ రితిరాజ్కు పక్కా సమాచారం అందింది. అక్కడ అసభ్య, అర్ధనగ్న నృత్యాలతో పాటు వ్యభిచార దందా కూడా నడుస్తోందని తెలిసింది. దీనిపై స్థానిక పోలీసులకు చెప్తే సమాచారం లీక్ అవుతుందని భావించిన డీసీపీ, తన సిబ్బందిని ఎవరినీ తీసుకెళ్లకుండా అర్ధరాత్రి ఒంటరిగా మఫ్టీలో పబ్కు వెళ్లారు. ఒంటిపై స్పై కెమెరాలను ధరించి వెళ్లిన ఆమె అక్కడ యువతులతో చేయిస్తున్న అశ్లీల నృత్యాలను, కస్టమర్లను లోబరుచుకుంటున్న దృశ్యాలను రహస్యంగా ఫొటోలు, వీడియోలు తీశారు. పక్కా ఆధారాలు సేకరించిన వెంటనే ప్రత్యేక పోలీసు బృందాలను ఆదేశించి అర్ధరాత్రి పబ్పై మెరుపు దాడి చేయించారు.ఈ పబ్ నిర్వాహకుల దోపిడీ వెనుక పెద్ద నెట్వర్కే ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగికి డేటింగ్ యాప్లో ఓ యువతి పరిచయమైంది. ఆమె ప్లాన్ ప్రకారం సదరు యువకుడిని గత నెల 29న ఈ కేపీహెచ్బీ పబ్కు పిలిపించింది. అక్కడ అతను రెండు పెగ్గులు, ఆమె నాలుగు పెగ్గుల విస్కీ తాగారు. తీరా బిల్లు చూస్తే రూ.41,606 వేయడంతో ఆ యువకుడు షాక్కు గురయ్యాడు. అంత బిల్లు ఎలా వస్తుందని నిలదీసేలోపే ఆ యువతి అక్కడి నుంచి మాయమైంది. దీనిపై బాధితుడు కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా స్థానిక పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ వ్యవహారం కాస్తా డీసీపీ రితిరాజ్ దృష్టికి వెళ్లడంతో నేరుగా రంగంలోకి దిగింది. పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలోనే ఇంత పెద్ద దందా జరుగుతున్నా స్థానిక పోలీసులు పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పబ్ నిర్వాహకులు ఇచ్చే నెలవారీ లంచాలు, మామూళ్లకు అలవాటుపడి స్థానిక పోలీసులు ఈ అసాంఘిక కార్యకలాపాలకు కొమ్ముకాస్తున్నట్లు డీసీపీ విచారణలో గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశారు. కస్టమర్లను మత్తులో ముంచి, ఖరీదైన మద్యం ఆర్డర్ చేయించి నిలువుదోపిడీ చేస్తున్న ఈ ముఠా వెనుక ఉన్న వారందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ దాడిలో పబ్ మేనేజర్ను పోలీసులు అరెస్ట్ చేయగా.. అసభ్యంగా డ్యాన్సులు చేస్తున్న నలుగురు యువతులు సహా మరో నలుగురు యువకులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.