
‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమాతో దర్శకుడిగా వెంకటేష్ మహా అందరినీ ఆకట్టుకున్నారు. ఆ తరువాత నటుడిగా, నిర్మాత, కో ప్రొడ్యూసర్గా వెంకటేష్ మహా బిజీగా మారిపోయాడు.
మళ్లీ ఇన్నేళ్ల తరువాత దర్శకుడిగా రెండో మూవీని ఆడియెన్స్ ముందుకు తీసుకు వచ్చాడు. ఈ సారి సత్యదేవ్తో ‘రావు బహదూర్’ అంటూ వెంకటేష్ మహా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. నేడు విడుదలైన ఈ చిత్రం ఎలా ఉంది? ఆడియెన్స్కి ఏ మేరకు ఎక్కేస్తుందన్నది చూద్దాం. కథ రామప్ప రావు బహదూర్ (సత్య దేవ్) ఎనిమిదేళ్ల పాటుగా ఒకే గదికి పరిమితమై ఉంటాడు. అతని భార్య రేణుక (దీపా థామస్) కూడా మరో గదిలో అలానే 8 ఏళ్ల పాటు బంధీగా ఉంటుంది. కొలనులో పడిపోయి చనిపోయిన చిన్న కొడుకు కుసుమప్ప గురించే ఆలోచిస్తుంటాడు రామప్ప. రాజ భవనాన్ని, తండ్రి బాగుగుల్ని చూసుకుంటూ అతని పెద్ద కొడుకు లవనప్ప ఉండిపోతాడు. ఇక రామప్పకి ఆచారి స్నేహితుడు మాత్రమే కాకుండా వైద్యుడు కూడా. అయితే రామప్పకు లివర్ క్యాన్సర్ ఉంటుంది. ఇక చనిపోతాడు అని వైద్యులు చెప్పిన ప్రతీ సారి.. తిరిగి వచ్చేస్తాడు రామప్ప. తనకు అనుమానం అనే పెనుభూతం పట్టింది.. అది పోయే వరకు తన దేహం విడిచి ఆత్మ వెళ్లదురా అని తన స్నేహితుడు, వైద్యుడైన ఆచారికి రామప్ప చెబుతాడు. కుసుమ తన కొడుకు కాదని రామప్ప నమ్ముతుంటాడు. మరి రామప్ప అనుమానం ఎలా తీరుతుంది? అసలు కుసుమ తన కొడుకు కాదని రామప్ప ఎందుకు అనుకుంటాడు? రామప్ప గతం ఏంటి? రామప్ప వెనక ఉన్న రహస్యాలు ఏంటి? అనుమానం అనే పెనుభూతం నుంచి రామప్పకు చివరకి విముక్తి కలిగిందా? నిజాలు బయటకు వచ్చాయా? అన్నదే కథ. రావు బహదూర్ పాయింట్ బాగుంటుంది. మెరిసేదంతా బంగారం కాదు.. నలుపు, తెలుపు అన్న తేడాతో వ్యక్తుల్ని భిన్నంగా చూడకూడదు.. అనే పాయింట్లను చెప్పే ప్రయత్నాన్ని వెంకటేష్ మహా చేసినట్టుగా అనిపిసిస్తుంది. కాకపోతే ఆ పాయింట్ని కథగా మలిచి, సినిమా కోసం రాసుకున్న బ్యాక్ డ్రాప్, తీసిన విధానం మాత్రం మినిమం డిగ్రీ చదివిన వాళ్లకి కూడా అర్థం కాదు. ఈ సినిమాని, ఇందులో భావాన్ని అర్థం చేసుకోవాలంటే పీహెచ్డీలు చేసి ఉండాలేమో అని ఆడియెన్స్కి అనిపించినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. భువనాలయం అనే రాజ కోట.. అందులో రామప్ప ఒకే గదిలో 8 ఏళ్ల పాటుగా ఉండటం.. ఇదంతా కూడా ప్రారంభంలో ఓ రకంగా అనిపించొచ్చు. అసలేం చేస్తున్నాడు.. ఏమై ఉంటుంది.. ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు.. అనే చిరాకు కూడా కలగొచ్చు. ఒకసారి చిన్న కథ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్లడం, మళ్లీ వర్తమానంలోకి వస్తుండటంతో కొంత మందికైనా ఇంట్రెస్టింగ్ ఫీల్ కలగొచ్చు. కుసుమప్ప, రామప్ప, రేణుక, ఆచారి, లవణప్ప, అచ్చమ్మ పాత్రలతో ఫస్ట్ హాఫ్ అంతా కాస్త గందరగోళంగానే సాగుతుంది. రేణుకతో రామప్ప ఉన్న సీన్లు కాస్త రిలీఫ్గానే అనిపిస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా సాదాసీదాగానే అనిపిస్తుంది. ద్వితీయార్దం ఆరంభంలో కుసుమప్పగా పిల్లాడితో, రామప్ప సీన్లు కాసేపు నవ్విస్తాయి. ఇక కొత్త అనుమానాలు పుట్టుకు రావడం, ఆచారి పాత్ర మీద డౌట్ కలిగించేలా సీన్లు పడటం, పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవ్వడంతో కథ కాస్త ముందుకు వెళ్లినట్టుగా అనిపిస్తుంది. అక్కడ వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ బాగుంటుంది. అయితే క్లైమాక్స్లో మాత్రం ఎవ్వరూ ఊహించని ట్విస్ట్ వస్తుంది. అప్పటి వరకు ఆడియెన్స్కి కొన్ని అనుమానాలు వస్తాయి.. ట్విస్ట్ ఇదే అయి ఉంటుందని అంతా అనుకుంటారు. కానీ వెంకటేష్ మహా మాత్రం క్లైమాక్స్లో తన ట్విస్టులతో అందరినీ ఆశ్చర్యపరుస్తాడు. భ్రమలు, భయాలు, అనుమానాలు అంటూ రకరకాల పేర్లు పెట్టి ఓ సింపుల్ కథను తన నాలెడ్జ్ను, పైతాన్ని వెంకటేష్ మహా జోడించినట్టుగా అనిపిస్తుంది. ఇందులో వెంకటేష్ మహా చెప్పాలని అనుకున్నది, చూపించింది ఏంటో.. సామాన్య ప్రేక్షకులకు అర్థం కాక.. ఫస్ట్ హాఫ్లోనే బయటకు వెళ్లే ప్రమాదం ఉంది. ఇక సహనంగా, ఓపికతో భరిద్దాం అని చివరి వరకు చూసిన ప్రేక్షకుడికి కాస్త రిలీఫ్గా ఓ రెండు ట్విస్టులు ఉంటాయి. ఆ ఐదు నిమిషాలు మాత్రమే కాస్త ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది.